ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ సంతాపం తెలిపారు.
విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం, తెలుగు చిత్ర సీమకు తీరని లోటని తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. చంద్రమోహన్ స్పూర్తితో ఎందరో నటీనటులు ఉన్నత స్థాయికి ఎదిగారని., కళామతల్లి ముద్దుబిడ్డగా తెలుగుతో పాటు పలు భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని చంద్రమోహన్ సొంతం చేసుకున్నారని సీఎం కొనియాడారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరమని ఏపీ సీఎం జగన్ అన్నారు. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. చంద్రమోహన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.
ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యుల… pic.twitter.com/XklbQ0l1o5
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2023
కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించారు చంద్రమోహన్ . ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. హీరోగానే కాకుండా కమెడియన్, సహాయనటుడిగానూ మెప్పించారు చంద్రమోహన్. హైదరాబాద్లో సోమవారం చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.