
- ప్రైవేట్ కంపెనీలకు గనులు దక్కేలా బీజేపీ, బీఆర్ఎస్ పనిచేసినయ్: జనక్ ప్రసాద్
- మినరల్ యాక్ట్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతిచ్చిందని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కేసీఆర్ పదేండ్ల పాలనలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడి విద్యుత్ సంస్థలను ఆగం చేశారని ఐఎన్టీయూసీ జాతీయ నేత జనక్ ప్రసాద్ అన్నారు. సింగరేణి సంస్థను మూసివేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. తమ రాజకీయ లబ్ధి కోసం బీజేపీతో కలిసి సింగరేణిని ముంచే ప్రయత్నం చేశారన్నారు. సంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేసేలా సింగరేణికి దక్కాల్సిన బొగ్గు గనులను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రెండు పార్టీలు కుట్రలు చేశాయని ఆరోపించారు. శనివారం గాంధీ భవన్లో జనక్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
మరో పదేండ్లలో సింగరేణి గనుల్లో బొగ్గు నిల్వలు అడుగంటుతాయని అన్నారు. కొత్త గనులను సింగరేణికి కేటాయించకపోతే సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గనులను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టి తెలంగాణకు తీరని ద్రోహం తలపెట్టాయని ఆయన మండిపడ్డారు. 2015లో బహిరంగ వేలం ద్వారా ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే మినరల్యాక్ట్ సవరణ బిల్లును కేంద్రం తీసుకొచ్చిందని, దానికి బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారని గుర్తుచేశారు. 2015లో బీజేపీ, అప్పటి టీఆర్ఎస్ కలిసి చట్టాన్ని సవరించి..
సింగరేణిని చంపేసి, తనకు అనుకూలంగా ఉన్న ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టాయని ఆరోపించారు. గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్స్ సహా అన్ని బొగ్గు గనులను సాధించుకోవాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంటే, అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రక్రియకు అడ్డుపడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో గోదావరి వ్యాలీలో మొట్టమొదట బొగ్గు తవ్వకం ప్రారంభించింది ఇల్లందులోనేనని, ఇదే ప్రాంతంలో గనులను ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టిన చరిత్ర కేసీఆర్కే దక్కుతుందని మండిపడ్డారు. తెలంగాణకు తలమానికమైన సింగరేణిపై ప్రభుత్వం కక్ష కట్టిందని, తమ రాజకీయ వ్యాపార లబ్ధి కోసం ప్రైవేటు కంపెనీల నెత్తిన పాలుపోసి, సింగరేణి నెత్తిన శఠగోపంపెట్టిందని ఆయన గుర్తుచేశారు.