
అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తొలిసారి మాట్లాడుకున్నారు. వాణిజ్య ఒప్పందంలో చిక్కులు, ప్రతినిధుల తదుపరి సమావేశాలపై చర్చించారు. దాదాపు 90 నిమిషాలు ఫోన్లో మాట్లాడుకున్న ట్రంప్, జిన్ పింగ్ పూర్తిగా ట్రేడ్, సుంకాలపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. చైనా ప్రభుత్వ మీడియా కూడా ట్రంప్, జిన్ పింగ్ ఫోన్ కాల్ సంభాషణను ధృవీకరించింది. అయితే వైట్ హౌజ్ ఇంకా ప్రకటించలేదు.
నేను, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఫోన్ లో చాలా కీలక విషయాలు మాట్లాడుకున్నాం..మా సంభాషణ దాదాపు గంటన్నరపాటు సాగింది. రెండు దేశాలకు సానుకూలంగా మా సంభాషణ ముగిసింది. అని డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో రాశారు. ఇరు దేశాల నేతలు అమెరికా, చైనా వాణిజ్య ఒప్పందంలోని కొన్ని సమస్యలపై చర్చించామన్నారు. త్వరలో ఇరుదేశాల ప్రతినిధుల తదుపరి భేటీ ఉంటుందని ట్రంప్ అన్నారు. యూఎస్ బృందంలో ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్, వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్, యూఎస్ వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ ఉంటారని ట్రంప్ తెలిపారు.
గత కొన్ని నెలలుగా అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ చైనా వస్తువులపై 145 శాతం సుంకాలు విధిస్తే..చైనా ప్రతిగా అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాలు విధించింది. అయితే ఈ ఫోన్ కాల్ ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతను తగ్గించి, జెనీవాలో కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని అమలు చేయడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత నెలలో జెనీవాలో జరిగిన చర్చల్లో ఇరు దేశాలు సుంకాలను తగ్గించుకోవడానికి అంగీకరించాయి.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇరు దేశాల సంబంధాలను సరైన దిశలో నడిపించడానికి ఇరువురు నేతలు సంకల్పం వ్యక్తం చేశారు. జిన్ పింగ్ తైవాన్ సమస్యను జాగ్రత్తగా పరిష్కరించాలని ట్రంప్ను కోరారు. తద్వారా విభజనవాదులు రెండు దేశాలను ఘర్షణ వైపుకు నెట్టకుండా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. జెనీవా ఒప్పందాన్ని అమలు చేసేందుకు వీలైనంత త్వరగా మరో రౌండ్ సమావేశాలను కావాలని ఇద్దరు నేతలు ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది.
డొనాల్డ్ ట్రంప్, జిన్ పింగ్ ఫోన్ కాల్ సంభాషణపై ట్రంప్ సోషల్ మీడియాలో స్పందించారు. జిన్ పింగ్ తో డీల్ చేయడం చాలా కష్టమని, అయినప్పటికీ అతన్ని తాను "ఇష్టపడతానని" ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్లో తెలిపారు. చైనా ఆర్థిక వ్యవస్థ చాలా బాగా పనిచేయాలని అమెరికా కోరుకుంటుందని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ ఫోన్ కాల్ ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించి, భవిష్యత్ చర్చలకు మార్గం సుగమం చేస్తుందని మార్కెట్ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేశారు.