పెద్దపల్లి జిల్లా : భారతదేశ చరిత్రలో ఒక గిరిజన వ్యక్తిని రాష్ట్రపతి చేయడం బీజేపీకే సాధ్యమైందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తానని, 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి గిరిజనులను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదన్నారు. బుధవారం పెద్దపల్లిలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. ఇండియన్ ఎకానమీని ప్రపంచంలో టాప్ ప్లేస్ లో మోడీ ఉంచుతున్నారని తెలిపారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మోడీ కంకణం కట్టుకున్నారు’ అని వివేక్ పేర్కొన్నారు. RFCIL ను రీ ఓపెన్ చేయడం కోసం తాను కృషి చేస్తే .. ప్రధాని మోడీ నిధులు కేటాయించి ప్రారంభించారని గుర్తుచేశారు.
హైదరాబాద్ లో కావాలనే..
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రచారం కోసం రూ.500 కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేశారని వివేక్ ఆరోపించారు. హైదరాబాద్ లో కావాలనే కేసీఆర్ ప్రచార బోర్డులను ఏర్పాటు చేయించారని చెప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి తగిన ప్రచారం లభించకూడదనే దురుద్దేశంతో పక్కా ప్లాన్ ప్రకారమే హైదరాబాద్ నగరమంతా బోర్డులు, హోర్డింగ్ లు కేసీఆర్ ఏర్పాటు చేయించారని వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ స్కీమ్ పై కేటీఆర్, ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.