దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఇంత సభ్యత్వం లేదు
చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు పంపీణి చేసిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్: తమ పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు బీమా సౌకర్యం కల్పించింది. సభ్యత్వం తీసుకున్న తర్వాత వివిధ కారణాల వల్ల చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు తెలంగాణభవన్లో మంత్రి కేటీఆర్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం బీమా కింద 1,581 మందికి రూ. 31కోట్ల 62 లక్షల చేల్లించామని ఆయన తెలిపారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను కలుసుకోవడం కొంత బాధగా ఉన్నా..
పార్టీ తరపున మీకు అండగా ఉంటున్నందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కార్యకర్తల కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది సభ్యత్వం ఉండడం గర్వకారణమని ఆయన అన్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం లేదని కేటీఆర్ అన్నారు. ఈ
60 లక్షల మంది కార్యకర్తలను సీఎం కేసీఆర్ కడుపులో పెట్టి చూసుకుంటారని ఆయన అన్నారు. భారతదేశంలో ఒకటి రెండు పార్టీలు మాత్రమే బీమా సౌకర్యం కల్పిస్తున్నాయని ఆయన తెలిపారు.
60 లక్షల మంది కార్యకర్తల బీమా కోసం ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.11.50 కోట్లు కట్టినట్లు ఆయన తెలిపారు.
టీఆర్ఎస్ అధికారంలో ఉందంటే.. దానికి వెనక లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తల కృషి ఉందని ఆయన అన్నారు. త్వరలోనే ఎమ్మెల్యేలు కూడా చనిపోయిన కార్యకర్తల ఇంటింటికి వెళ్లి చెక్కులు అందజేస్తారని ఆయన తెలిపారు. అనంతరం కార్యకర్తల కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కేటీఆర్ భోజనం చేశారు.