రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని తేలిపోయింది. కేసీఆర్ చేసిన ఆరోపణల్లో ఒక్క నిజం కూడా లేదని, ఆ పథకాలన్నింటినీ బీఆర్ఎస్ హయాంలోనే పెండింగ్లో పెట్టినట్టు వెల్లడైంది. కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి గతేడాది జనవరి నుంచి కాంగ్రెస్ అధికారం చేపట్టే డిసెంబర్ 7వ తేదీ నాటికి లక్షపైనే అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నట్టు అధికారులు నివేదించారు. వీటికి సంబంధించి ఏకంగా రూ.1000 కోట్లు అవసరం అవుతాయని తెలిపారు.
ఎన్నికల కోడ్ లోపే రిలీజ్ చేసేందుకు నిధులు కేటాయించాలని గత ప్రభుత్వాన్ని సెప్టెంబర్లోనే కోరినా.. పైసా ఇవ్వలేదని తెలిపారు. దీంతో మరిన్ని అప్లికేషన్లు పేరుకుపోయాయని పేర్కొన్నారు. ఎమ్మార్వో స్థాయి వెరిఫికేషన్లో దాదాపు 30 వేలు ఉండగా, ఆర్డీవో స్థాయిలో మరో 55 వేల అప్లికేషన్లు ఉన్నాయి. ట్రెజరరీలో బిల్లులు సాంక్షన్ కాకుండా 20 వేల పైనే ఉన్నట్టు అధికారులు తెలిపారు. కల్యాణలక్ష్మికి సంబంధించి బడ్జెట్లో పెటుకున్న మేరకు ఆర్థిక శాఖ ప్రతి ఏటా మొదటి నెలలో బీఆర్వోలను ఇస్తోంది. అయితే, ఆ మేరకు నిధుల సర్దుబాటు మాత్రం చేయలేదని పేర్కొన్నారు.
2023–24 కు సంబంధించి కల్యాణ లక్ష్మి పథకానికి రూ.3,210 కోట్లు కేటాయింపులు చేశారు. నిధులు నెలానెలా కొంత మొత్తం చెల్లింపులు చేయాల్సి ఉన్నా.. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ స్థాయిలో ఇవ్వలేదు. ఫలితంగా ఒక్క అప్లికేషన్కు ఏడాది దాటితే కానీ చెక్కులు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని అధికారులు రిపోర్ట్లో వివరించారు.