- కేటీఆర్ ను సీఎం చేస్తానన్నది నిజమే!
- 70 ఏండ్లకు రిటైర్మెంట్ తీసుకుంటానన్నా
- కేటీఆర్ ను ఆశీర్వదించుమని కోరాను
- దళిత సీఎంపై వెనక్కి తగ్గలే.. సమయం వచ్చినప్పుడు చేస్తం
- సెంటర్ కు పోయే ఆలోచన లేదు.. ఇక్కడే ఉండి చక్రం తిప్పుత
- ఇండియా టుడే ఇంటర్వ్యూలో సీఎం కేసీఆర్
హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ ను సీఎం చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అన్నది నిజమేనని, ఆ విషయాన్ని ఆయన నిజామాబాద్ పబ్లిక్ మీటింగ్ లో చెప్పడం తప్పని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ కీలక అంశాలను వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల నేపథ్యంలో తాను తరుచూ ప్రధానిని కలిసేవాడినని చెప్పారు. ఈ సందర్బంగా ఆయన ఎన్డీఏలో జాయిన్ కావాలని అడిగారని, తెలంగాణ కోసం ఏదైనా చేయాలని షరతు పెట్టానని కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో తాను యాభై ఏండ్లు రాజకీయాల్లో ఉన్నానని, తన వయస్సు 70 ఏండ్లకు చేరగానే రిటైర్మెంట్ తీసుకుంటానని తెలిపానని కేసీఆర్ చెప్పారు.
‘ఆ వెంటనే కేటీఆర్ గురించి ఆరా తీశారు. మీరు ప్రధానమంత్రి.. మీ ఆశీస్సులు అందించాలి..కేటీఆర్ కు సహకరించాలని చెప్పాను. ఇలాంటి వ్యక్తిగత సంభాషణలను రాజకీయ వేదికపై వెల్లడించడం ప్రధానికి తగునా?’అని అన్నారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రధాని కాకపోయి ఉంటే రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4 లక్షలకు పెరిగి ఉండేదని, చాలా పనులను ఆపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసైని అడ్డం పెట్టుకొని బిల్లులు ఆపుతున్నారని ఆరోపించారు.
దళిత సీఎంపై వెనక్కి తగ్గలే
దళితుడిని సీఎం చేస్తామన్న మాట వాస్తవమేనని, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 స్థానాల్లో విజయం సాధించిందని, కొత్త రాష్ట్రం కావడంతో ఎమ్మెల్యేలంతా తననే సీఎంగా ఉండాలని కోరారని, అందుకే బాధ్యతలు చేపట్టానని తెలిపారు. దళిత సీఎం వాగ్దానంపై తాము వెనక్కి తగ్గలేదని కేసీఆర్ పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా దళితుడిని ముఖ్యమంత్రిని చేసి తీరుతామని చెప్పారు. ‘కాంగ్రెస్ ఫ్లాప్ పార్టీ. డిఫాల్ట్గా ఎన్నికల్లో గెలిచే అలవాటును పెంచుకున్నారు. ఇది వ్యవస్థ లేని దురహంకార పార్టీ, దీని విధానం రాష్ట్రానికి రాష్ట్రం భిన్నంగా ఉంటుంది. కర్నాటకలో ఒక మాట.. తెలంగాణలో మరో మాట.. రాజస్థాన్ లో ఇంకో మాట చెప్పే పార్టీ .’అని కేసీఆర్ అన్నారు.
ఇక్కడే కూర్చొని చక్రం తిప్పుతా
తాను ఎక్కడికీ వెళ్లనని, ఇక్కడే కూర్చొని జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని అన్నారు. జాతీయ రాజకీయాలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ గుడ్ పొజిషన్ లో ఉన్నదని, మూడోసారి గెలిస్తే దానిని గ్రేట్ దాకా తీసుకెళ్తామని చెప్పారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని తెలిపారు. 2.5 మిలియన్ల మంది బీఆర్ఎస్ లో చేరారని అన్నారు.