- అవసరమైన ఎరువులు, విత్తనాలు పంపు
- ఎరువుల వ్యాపారికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్
ములుగు, వెలుగు: ఎర్రవల్లి ఫామ్హౌస్కు వచ్చి ఎవుసం చేసుకుంటానని, అవసరమైన ఎరువులు పంపాలని ఎరువుల వ్యాపారి ఏనుగు బాపురెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారు. ఆరోగ్యం బాగుందని, పది రోజుల్లో వస్తానని తెలిపారు. గజ్వేల్లో అందరిని కలుస్తానని పేర్కొన్నారు. తుంటి ఎముక సర్జరీ తర్వాత నుంచి హైదరాబాద్ నందినగర్లోని ఇంట్లో ఉంటున్న కేసీఆర్.. ఆదివారం ములుగు మండలం వంటిమామిడిలోని బాపురెడ్డికి ఫోన్ చేశారు.
రెండు, మూడు రోజుల్లో ఎరువులన్నీ పంపాలని కోరారు. అలాగే పంపిస్తానని బాపురెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయానికి అవసరమైన పురుగుల మందులతో పాటు ఇతర సామగ్రి గురించి కేసీఆర్ ను బాపురెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ‘‘సార్.. మీ ఆరోగ్యం ఎట్లున్నది..’’అని బాపురెడ్డి అడగ్గా.. ‘‘నేను బాగున్నాను.. ఇబ్బందేం లేదు.. ఫామ్హౌస్ కు వస్తున్న.. ఎవుసం చేస్కుంటా..”అని కేసీఆర్ సమాధానం చెప్పారు.
‘‘మీరు చెప్పిన ఎరువులు.. విత్తనాలు.. పురుగుల మందులు పంపిస్తా”అని కేసీఆర్కు బాపురెడ్డి జవాబిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ దాదాపు మూడు నిమిషాల పాటు బాపురెడ్డితో మాట్లాడారు. కొన్నేండ్లుగా ఎర్రవల్లిలోని ఫామ్హౌస్కు బాపురెడ్డినే ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తున్నారు. డిసెంబర్ 7న అర్ధరాత్రి ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. దీంతో ఆయన్ను హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ తీసుకెళ్లి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. కొద్ది రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న కేసీఆర్.. తర్వాత నందినగర్లోని ఆయన సొంతింట్లో ఉంటున్నారు.
నేడు ఫామ్హౌస్కు కేసీఆర్
మాజీ సీఎం కేసీఆర్.. సోమవారం ఎర్రవెల్లిలోని తన ఫామ్హౌస్కు వెళ్లనున్నారు. అక్కడే సంక్రాంతి జరుపుకుంటారని పార్టీ ముఖ్య నేతలు చెప్పారు. కొన్ని రోజులు ఫామ్హౌస్లో ఉండి.. తర్వాత గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు వెళ్తారు. అక్కడ నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ అందుబాటులో ఉండేలా లీడర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆ తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో తెలంగాణ భవన్కు వస్తారని తెలిసింది. ఇక్కడ కూడా కొన్ని రోజుల పాటు పార్టీ లీడర్లు, కార్యకర్తలకు ఆయన అందుబాటులో ఉంటారని సమాచారం. ప్రధాన ప్రతిపక్ష నేత కావడంతో కేబినెట్ హోదాలో కేసీఆర్ కోసం కుందన్బాగ్లోని ఓ క్వార్టర్ సిద్ధం చేసినట్టు తెలిసింది. నందినగర్లోని తన సొంత ఇంటికి ఇరుకైన రోడ్డు ఉండటంతో రాకపోకలకు ఇబ్బంది అవుతుందనే.. కుందన్బాగ్లోని క్వార్టర్కు షిఫ్ట్ కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.