హెటిరో పార్థసారథిరెడ్డి ట్రస్టుకు గత బీఆర్ఎస్ సర్కారు కేటాయించిన 15 ఎకరాల భూముల లీజును రద్దు చేయాలని సీఎం రేవంత్ సూత్రప్రాయంగా నిర్ణయించారు. హెటిరో కంపెనీ ఎండీ పార్థసారథి రెడ్డి 2014 సెప్టెంబర్ లో సాయిసింధు ఫౌండేషన్ పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పారు. తాము చేపట్టే క్యాన్సర్ జనరల్ హాస్పిటల్ నిర్మాణానికి శేరిలింగంపల్లి మండలంలోని ఇజ్జత్నగర్లో 15.48 ఎకరాల స్థలం కేటాయించాలని నాటి సీఎంకు అప్లై చేసుకున్నారు. ఒక్క ఏడాది కూడా కార్యకలాపాలు నిర్వహించని ఈ ట్రస్ట్ ఏకంగా వందల కోట్ల విలువైన భూమి అడిగితే పక్కన పెట్టాల్సిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. లీజు నిబంధనలన్నీ ఆ ట్రస్ట్కు అనుకూలంగా మార్చి భూసంతర్పణ చేసింది.
అయితే..ఇజ్జత్నగర్లో ట్రస్ట్ అడిగిన స్థలాన్ని అప్పటికే టీఎస్ఐఐసీ వేలం వేయాలని నిర్ణయించింది. దీంతో ఇజ్జత్నగర్ బదులు ఖానామెట్లో ప్లేస్ ఇవ్వాలని ఫైళ్లు మార్చారు. ఖానామెట్లో సర్వే నెంబర్ 41/14/2లో 15 ఎకరాల స్థలం కేటాయించాలని సీసీఎల్ఏకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టాప్ ప్రియారిటీ ఆదేశాలిచ్చారు. మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఖానామెట్లో ఒక్కో ఎకరం రూ.33.70 కోట్లు. మొత్తం 15 ఎకరాలకు రూ.505.50 కోట్లు అవుతాయని, దీన్ని వేలం వేయాలనుకున్నట్లు అప్పటి శేరిలింగంపల్లి తహశీల్దార్, అప్పటి కలెక్టర్ నోట్ సమర్పించారు. వేలం వద్దని.. సాయిసింధు ఫౌండేషన్ ట్రస్ట్ కు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశించింది.
హైటెక్ సిటీకి 500 మీటర్ల దూరంలో హెచ్ఐసీసీకి వెళ్లే మెయిన్ రోడ్డును ఆనుకొని ఉన్నందున, ఆ స్థలం అత్యంత విలువైందని రాజేంద్రనగర్ ఆర్డీవో కూడా అదే రేటును ధ్రువీకరించారు. జీవో నెం.571 ప్రకారం ఆ భూమిని సాయిసింధు ఫౌండేషన్ కు లీజుపై కేటాయించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కు మెమో జారీ చేసింది. జీవో నెం.571 ప్రకారం.. భూమి విలువలో పది శాతం లీజు రెంట్ గా చెల్లించాలి. అంటే రూ.505 కోట్ల విలువ ఉన్న భూమికి ఏడాదికి రూ.50 కోట్లు చెల్లించాలి. ఐదేండ్లకోసారి 10% చొప్పున పెంచుతూ పోవాలి. అంటే 60 ఏండ్ల లీజు కోసం.. ప్రభుత్వానికి దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా చెల్లించాలి. సాయిసింధు ఫౌండేషన్ కు 3 ఎకరాలు మాత్రమే కేటాయించేందుకు అర్హత ఉందని అప్పటి కలెక్టర్ సీసీఎల్ఏ స్పెషల్ సెక్రటరీకి లెటర్ రాశారు. మూడు కాదు.. 11 ఎకరాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటికే 15 ఎకరాల్లో ఆ ఫౌండేషన్ నిర్మాణాలు మొదలుపెట్టింది.