త్వరలో సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్​ పర్యటన

త్వరలో సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్​ పర్యటన

పటాన్ ​చెరు, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో త్వరలో సీఎం కేసీఆర్ ​పర్యటించనున్నారని, జిల్లా ప్రజలకు వరాలు ఇస్తారని మంత్రి హరీశ్​రావు అన్నారు. శనివారం పటాన్​చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతం నుంచి ఔటర్​ రింగు రోడ్డు వరకు రూ.121 కోట్లతో చేపట్టనున్న ఫోర్ వే ​లేన్​ రోడ్డు పనులు, రుద్రారంలోని సిద్ధి గణపతి ఆలయ ఆవరణలో రూ.4.50 కోట్లతో నిర్మించనున్న రాజగోపురాలు, కల్యాణ మండపం, అన్నదాన సత్రం నిర్మాణ పనులకు ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

అనంతరం పటాన్​చెరు మార్కెట్​యార్డులో ఏర్పాటు చేసిన యార్డు కొత్త కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన చీఫ్​ గెస్టుగా హాజరయ్యారు. కొత్త కమిటీ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో సంగారెడ్డిలో వైద్య కళాశాల, పటాన్​చెరు నియోజక వర్గంలో సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం వచ్చి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ముత్తంగి, ఇస్నాపూర్, పాశమైలారం రోడ్డులో  ట్రాఫిక్​ సమస్యలు తలెత్తడం, ప్రమాదాలు జరుగుతుండటంతో వాటి నివారణ చర్యలు చేపడుతున్నామన్నారు. పాశమైలారం పారిశ్రామిక వాడ నుంచి కర్దనూరు ఓఆర్​ఆర్​ జంక్షన్​ వరకు ఫోర్​ వే లేన్​ నిర్మిస్తున్నట్లు తెలిపారు.  

ఐదేళ్లుగా ఇక్కడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు, మలక్​పేటలో ఉన్న ఉల్లిగడ్డ మార్కెట్​ ను ఇక్కడికి తరలించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కొత్త మార్కెట్ కమిటీ చైర్మన్​ గా నియమితులైన విజయకుమార్ మార్కెట్ అభివృద్ధికి మరింత కృషి చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ శరత్, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి,  జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.