
- ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు
- కలెక్టర్, ఎలక్షన్ అధికారులు చర్యలు తీసుకోవాలి
- మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్యాదవ్
మేడిపల్లి, వెలుగు: అధికార పార్టీకి సహకరించే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటున్నా కూడా కిందిస్థాయి అధికారులు మాత్రం మారడం లేదని మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్యాదవ్ మండిపడ్డారు. మంగళవారం బోడుప్పల్లో ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కీసర ఆర్డీవో రాజేశ్ కుమార్ ఈఆర్వోగా ఎలక్షన్ విధులు నిర్వహిస్తూ... అధికార పార్టీ నేతలు బోడుప్పల్ రాత్రిపూట మద్యం పంచుతున్నారని ఫిర్యాదు చేసినా ఎంక్వయిరీ చేయకుండా వత్తాసు పలుకుతున్నాడని ఆయన ఆరోపించారు.
మంత్రి మల్లారెడ్డి కోడలు, కొడుకు మేడిపల్లిలోని ఎస్ వీఎం హోటల్ ని అద్దెకి తీసుకొని ప్రతిరోజు అనధికారికంగా సభలు నిర్వహిస్తున్నారని, దీనిపై కూడా ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా మేడ్చల్ కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.