
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఆగస్టు 2న రాత్రి కొచ్చి విమానాశ్రయంలో ముందుజాగ్రత్తగా ల్యాండ్ అయింది. ఎయిర్లైన్ తెలిపిన సమాచారం ప్రకారం.. విమానం కొచ్చి నుంచి షార్జాకు వెళుతోంది, అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, ఒక ప్రయాణీకుడు కాలిపోతున్న వాసనను వస్తున్నట్టు గమనించాడు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని వెనక్కి తిప్పి విమానాశ్రయానికి చేర్చాలని నిర్ణయించారు. ల్యాండింగ్ తర్వాత, విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన సిబ్బంది.. అలాంటి ఘటనకు సంబంధించిన ఆనవాళ్లు, ఆధారాలేవీ లేనట్టు గుర్తించారు.
ప్రయాణికుల కోసం విమానయాన సంస్థ మరో విమానాన్ని ఏర్పాటు చేసింది. విమానం 175 మంది ప్రయాణికులతో ఆలస్యంగా షార్జాకు బయలుదేరింది. జూలై 31న తెల్లవారుజామున షార్జా నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం.. సాంకేతిక సమస్యలతో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయినట్టు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
తమిళనాడులోని తిరుచిరాప్పలి నుంచి ఉదయం 10:45 గంటలకు విమానం బయలుదేరిన తర్వాత విమానాశ్రయ అథారిటీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
తిరువనంతపురంలో మధ్యాహ్నం సమయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. విమానంలో 154 మంది ప్రయాణికులు ఉన్నారని, ముందుజాగ్రత్తగా ల్యాండింగ్ చేశామని ఎయిర్లైన్స్ తెలిపింది.