తిరువనంతపురం: ప్రముఖ నటిపై లైంగిక వేధింపుల కేసులో మలయాళ యాక్టర్ దిలీప్కు భారీ ఊరట దక్కింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న దిలీప్ను న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు ఎర్నాకుళం జిల్లా, ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి హనీ ఎం వర్గీస్ సోమవారం (డిసెంబర్ 8) తీర్పు వెలువరించారు.
2017లో ఓ ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి కారులో లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన కేరళలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ ఘటనలో యాక్టర్ దిలీప్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అతన్ని ఏ8 నిందితుడిగా పేర్కొన్న పోలీసులు.. కుట్ర, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి అభియోగాలు మోపారు. ఈ కేసులో 2017లో పోలీసులు దిలీప్ను అరెస్ట్ చేయగా.. అదే సంవత్సరం అక్టోబర్లో అతనికి బెయిల్ లభించింది.
ప్రస్తుతం అతను బెయిల్పై బయట ఉన్నారు. దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు జరిగిన న్యాయ పోరాటం తర్వాత ఈ కేసులో దిలీప్ను నిర్దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో దిలీప్కు బిగ్ రిలీఫ్ లభించింది. అయితే.. ఈ కేసులో ఏ1 టూ ఏ6 నిందితులను న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. 2025, డిసెంబర్ 12న దోషులకు శిక్ష ఖరారు చేయనుంది.
