కొల్లం/న్యూఢిల్లీ : అమ్మాయిల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కేరళ ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్.బిందు మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు లేఖ రాశారు. ఇన్నర్వేర్ తీసి ఎగ్జామ్ హాల్లోకి వెళ్లాలని అధికారులు ఒత్తిడి చేశారని, ఈ వార్త విని షాక్కు గురైనట్టు మంత్రి బిందు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర విద్యా శాఖ స్పందించాలని, ఈ వ్యవహారంలో కలగజేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినులపట్ల ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. వారిని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. బలవంతంగా ఇన్నర్వేర్ విప్పించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. న్యాయబద్దంగా ఎగ్జామ్ నిర్వహించే బాధ్యత ఏజెన్సీకి ఉంటుందని, అయితే ఇలా ప్రవర్తించడం మాత్రం దారుణమని లేఖలో పేర్కొన్నారు.
కేరళ మహిళా కమిషన్కు ఫిర్యాదులు
నీట్ పరీక్షలు నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఎన్టీఏ అధికారుల వ్యవహారశైలిపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కేరళ ప్రభుత్వం వెంటనే స్పందించాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. కేరళ మహిళా కమిషన్ కూడా స్పందించింది. తమకు కూడా రెండు ఫిర్యాదులు అందినట్టు కమిషన్ వివరించింది. ఇప్పటికే కొల్లం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది.
విద్యార్థిని ఆరోపణల్లో నిజం లేదు: ఎన్టీఏ
అమ్మాయిల ఇన్నర్వేర్ తీసి ఎగ్జామ్కు అనుమతించారని విద్యార్థిని చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఎన్టీఏ అధికారులు తేల్చి చెప్పారు. తప్పుడు ఉద్దేశంతోనే ఎన్టీఏపై ఫిర్యాదు చేశారని ఆరోపించారు.
కొల్లంలో నిరసనలు
కేరళలో కొన్నిచోట్ల మంగళవారం ఆందోళనలు జరిగాయి. కొల్లం జిల్లా ఆయుర్లోని ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్పై నిరసనకారులు దాడి చేశారు. కుర్చీలు, గ్లాసులు పగులగొట్టారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.