దొంగతనం చేశాడన్న అనుమానంతో వ్యక్తిపై అమానుష దాడి

దొంగతనం చేశాడన్న అనుమానంతో వ్యక్తిపై అమానుష దాడి

అనాగరికం, అమానవీయం, దారుణం.. ఇలా వారు చేసిన పనికి ఏ పేరు పెట్టినా సరిపోదు. దొంగతనం చేశాడన్న ఆరోపణలతో ఎవరికీ చెప్పుకోలేని విధంగా ఓ యువకుడిపై దాడి చేసి అతని చావుకు కారణ మయ్యారు కొందరు ఆటోడ్రైవర్లు.  ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురం బస్టాండ్‌లో జరిగింది.

తిరువళ్లంకు చెందిన ఓ యువకుడు ఈ నెల 11న(బుధవారం) తిరువనంతపురం బస్టాండ్‌కు వెళ్లాడు. రాత్రి సమయంలో బస్టాండ్‌లో నిద్రిస్తున్న మరో వ్యక్తి సెల్‌ఫోన్‌ దొంగిలించాడనే అనుమానంతో అతనిపై స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లు దాడి చేశారు. తీవ్రంగా చితకబాది, సమీపంలోని ఓ వరిపొలంలో పడేశారు.

ఆ తర్వాత అతన్ని సజీవ దహనం చేయాలని ఆ ఆటోడ్రైవర్లలో ఒకడు సూచించగా..  మరొకడు కాల్చిన, పదునైన  కత్తితో అతని ప్రైవేట్ భాగాలను  కాల్చేశారు. అంతటితో ఆగకుండా కర్రలతో దాడి చేశారు.  మరుసటి రోజు గాయాలతో పడి ఉన్న ఆ యువకుడిని చూసిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆ యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించగా.. పరిస్థితి విషమించి ఐదు రోజుల తర్వాత(సోమవారం) మృతి చెందాడు.

అయితే యువకుడిని చితకబాదిన దృశ్యాలను ఓ వ్యక్తి తన ఫోన్‌లో చిత్రీకరించి వైరల్‌ చేశాడు. ఈ వీడియో ఆధారంగా నిందితుల్లో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒకడు మృతుని పక్కింటి వాడుగా వారు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.