శబరిమల (కేరళ): ఈ సారి శబరిమల ఆదాయం రూ.200 కోట్లు దాటింది. గడిచిన 39 రోజుల్లో ఆలయానికి రూ.204.30 కోట్ల ఆదాయం వచ్చిందని అపెక్స్ టెంపుల్ బాడీ ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డు (టీడీబీ) తెలిపింది. టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ మంగళవారం ఆదాయం వివరాలను మీడియాకు వెల్లడించారు. రూ.63.89 కోట్లు భక్తులు కానుకల రూపంలో సమర్పించారని, అలాగే, అరవణ ప్రసాదం విక్రయం ద్వారా రూ.96.32 కోట్లు, అప్పం ప్రసాదం విక్రయం ద్వారా రూ.12.38 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆయన తెలిపారు.
నాణేలను లెక్కించిన తర్వాత ఆదాయం మరింత పెరుగుతుందని ఆయన వెల్లడించారు. అలాగే, ఈ నెల 25వ తేదీ మండల పూజ నాటికి సుమారు 31,43,163 భక్తులు ఆలయాన్ని సందర్శించారని చెప్పారు. ఇప్పటి వరకు 7,25,049 మందికి అన్నదానం చేసినట్టు తెలిపారు. మండల పూజ అనంతరం టెంపుల్ను బుధవారం (ఈ నెల 27) రాత్రి 11 ఆలయాన్ని మూసివేసి.. మకరవిళక్కు పండుగ కోసం మళ్లీ 30వ తేదీన తెరుస్తారు. అలాగే, జనవరి 15వ తేదీ వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారని పీఎస్ ప్రశాంత్ తెలిపారు.