
- అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పని చేయాలి
- ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
పెనుబల్లి, వెలుగు : మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పని చేసి కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూచించారు. పెనుబల్లి మండలం మండాలపాడు లో కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అకాల వర్షాలతో భయమేస్తోందని, వడ్ల కొనుగోళ్లు త్వరగా చేపట్టాలని రైతులు కలెక్టర్ను కోరారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ కేంద్రంలో నిల్వల పరిస్థితిని ప్రతిరోజూ సమీక్షిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ప్రతీ కొనుగోలు కేంద్రంలో బోర్డు ఏర్పాటు చేసి టార్పాలిన్ పట్టాలు, గన్నీ బ్యాగులు ఎన్ని ఉన్నాయో పూర్తి వివరాలు రాయలన్నారు. రైతులు వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంటలో ఎటువంటి లేబర్ ఖర్చు ఉండదని, వాతావరణ సమస్యలు ఉండవని, ఎకరానికి లక్ష కంటే అధికంగా ఆదాయం వస్తుందని, దీనిపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్బైడ్ రహిత మామిడి పండిస్తే డిమాండ్ ఉందని, దీన్ని గమనించి రైతులు ఆ దిశగా సాగు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య, పెనుబల్లి తహసీల్దారు గంటా ప్రతాప్ ఉన్నారు.
వైద్య సేవలు అందించాలి
కల్లూరు : కల్లూరు మండల కేంద్రంలోని పీహెచ్సీ, సీహెచ్సీ, ప్రభుత్వ హోమియో వైద్యశాలను కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్లకు, గర్భిణులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. పేషెంట్లతో సేవాభావంతో మెలుగుతూ, మెరుగైన వైద్యసేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రిలో సరిపోను మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
మౌలిక సదుపాయాల పెంపుదలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిని ఆదేశించారు. సురక్షిత ప్రసవ కేలండర్ ప్రకారం గర్భిణులకు సరైన మందులు, సూచనలు ఇవ్వాలని చెప్పారు. సాధారణ ప్రసవాలపై ఆశా కార్యకర్తలు గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు రమేశ్, నవ్యకాంత్, తహసీల్డార్
పి. సాంబశివుడు తదితరులు ఉన్నారు.