- ఖమ్మం సీపీ సునీల్ దత్
ఖమ్మం టౌన్, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా పోలీసు అధికారులు పకడ్బందీగా పని చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. గురువారం పోలీస్ స్టేషన్ సెక్టర్ అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామపంచాయతీ ఎన్నికల బందోబస్త్ పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా, ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా వినియోగించుకునేలా పోలీస్ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను బైండోవర్ చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మహేశ్, ఇన్స్పెక్టర్ రాజిరెడ్డి పాల్గొన్నారు.
