
సికింద్రాబాద్, వెలుగు: జాతీయ ఖోఖో జూనియర్ గర్ల్స్ జట్టులో సిటీకి చెందిన బాలికకు స్థానం దక్కింది. కంటోన్మెంట్ పరిధి బోయిన్పల్లిలోని సీఎంఆర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న లహరి జాతీయ ఖోఖో జట్టుకు ఎంపికైంది. ఇటీవల బోయినపల్లి ప్లే గ్రౌండ్స్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఖోఖో జూనియర్ ఛాంపియన్ షిప్ పోటీల్లో సీఎంఆర్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన లహరి బెస్ట్ప్లేయర్గా నిలిచింది.
పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వివిధ జిల్లాలకు చెందిన 40 మంది బాలికలను ఎంపిక చేసి తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ స్టేడియంలో వీరికి 10 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 16 మందిని బెంగాల్లో జరుగనున్న జాతీయ క్రీడలకు ఎంపిక చేశారు. ఈ జట్టులో లహరికి చోటు లభించింది. లహరి ఎంపిక పట్ల అకాడమీ కోచ్లు, స్కూల్ డైరెక్టర్ ఎస్కే రెడ్డి, ప్రిన్సిపల్ నాగేశ్వరితోపాటు ఉపాధ్యాయులు, స్టూడెంట్లు హర్షం వ్యక్తం చేశారు.