నత్తనడకన కిన్నెరసాని టూరిజం!

నత్తనడకన కిన్నెరసాని  టూరిజం!
  • గతేడాది డిసెంబర్​లోనే పూర్తి చేయాలన్న మంత్రుల ఆదేశాలు బేఖాతర్​ 
  • రూ.23 కోట్ల నిధులతో కొనసాగుతున్న వర్క్స్​
  • పదేండ్లు కావొస్తున్నా పూర్తి కాని పనులు 
  • పర్యాటకంలో వెనుకబడుతున్నా పట్టించుకోని అధికారులు 
  • వర్షాకాలంలోనే పర్యాటకుల తాకిడి ఎక్కువ
  • త్వరగా అందుబాటులోకి తేవాలని పలువురి విజ్ఞప్తి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని కిన్నెరసాని టూరిజం పనులకు కావాల్సిన నిధులు ఉన్నా కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో పనులు స్లోగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పనులు ప్రారంభించి పదేండ్లవుతున్నా ఇంకా పెండింగ్​లో ఉండడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

రూ.23కోట్లు సాంక్షన్.. 

జిల్లాలో కిన్నెరసాని ప్రాజెక్ట్​ ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. జిల్లాలో పర్యాటకాన్ని డెవలప్​ చేసే క్రమంలో కిన్నెరసాని ప్రాజెక్ట్​ వద్ద అద్దాల మేడతో పాటు కాటేజీల్లో భాగంగా 36 గదుల నిర్మాణాలు, కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్​ రోడ్డులో హరిత హోటల్​లో బార్​ అండ్​ రెస్టారెంట్, హోటల్, కిచెన్​తోపాటు 44 రూమ్స్, కాన్ఫరెన్స్​ హాల్​ నిర్మాణాలకు 2015లో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకు రూ. 23 కోట్ల నిధులను సాంక్షన్​ చేసింది. 

పనులను పంచాయతీరాజ్​శాఖ చేపట్టింది. ఏండ్లు గడుస్తున్నా పనులు కాకపోవడంపై ఉన్నతాధికారుల సీరియస్​ అయ్యారు. 2019లో నిర్మాణ బాధ్యతలను పంచాయతీ రాజ్​నుంచి టూరిజం శాఖకు అప్పగించారు. టూరిజం అధికారులు మొదట్లో కొంత హడావుడి చేశారు. క్రమంగా పనుల్లో వేగం తగ్గింది. జరుగుతున్న కొన్ని పనులు కూడా నాసిరకంగా జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి.  

మంత్రుల ఆదేశాలను పట్టించుకోవట్లే.. 

జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే ఆలోచన  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అగ్రికల్చర్​ మినిస్టర్​ తుమ్మల నాగేశ్వరరావు గతేడాది కిన్నెరసానిలో పర్యటించారు. అద్దాల మేడలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. 

ఇల్లెందు క్రాస్​ రోడ్డులో నిర్మిస్తున్న హరిత​ హోటల్​ను సందర్శించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా అదే ఏడాది డిసెంబర్​లోగా అన్ని పనులు పూర్తి చేయాలని టూరిజం ఆఫీసర్లను ఆదేశించారు. కానీ పనులు మాత్రం స్పీడప్​ కాలేదు. మంత్రులు పెట్టిన డెడ్​ లైన్​ దాటి ఆరు నెలలు అవుతున్నా పనులు మాత్రం నత్తనడకననే సాగుతున్నాయి. 

పర్యటకులు ఎక్కువగా వచ్చే సమయం ఇదే.. 

ప్రకృతి సోయగాలకు పెట్టింది పేరు కిన్నెరసాని.. ఇక్కడి అందాలను  చూసేందుకు వర్షాకాలంలోనే పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. కిన్నెరసాని ప్రాజెక్ట్​లోకి వరద నీరు భారీగా వచ్చినప్పుడు, 12 గేట్లు ఎత్తినప్పుడు సందర్శకులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోతుంది. అద్దాల మేడ నుంచి ప్రకృతి అందాలు చూడడంతో పాటు ఫొటోలు దిగుతుంటారు. కిన్నెరసానిలో స్టే చేసేందుకు అద్దాల మేడకు సమీపంలో ప్రకృతిలో దట్టమైన చెట్ల మధ్యలో కాటేజీలు అందుబాటులోకి వస్తే బాగుంటుందని పర్యాటకులు పేర్కొంటున్నారు.

మరో వైపు భద్రాచలం, పర్ణశాల, కిన్నెరసాని వెళ్లే పర్యాటకులకు కొత్తగూడెంలోని క్రాస్​ రోడ్డులో నిర్మిస్తున్న హరిత హోటల్​ అందుబాటులోకి వస్తే పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనుల్లో వేగం పెంచాలని పలువురు కోరుతున్నారు. 

కాగా  పనుల  ఆలస్యంపై టూరిజం డిపార్ట్​మెంట్​ ఏఈ ప్రసాద్​ను వివరణ కోరగా కాంట్రాక్టర్​కు అనారోగ్యం కారణంగా పనులు చేయడంలో  కొంత జాప్యం జరుగుతోందన్నారు.   నెల రోజుల్లోగా పనులన్నీ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.