తెలంగాణలో దోచుకున్న సొమ్మును మహారాష్ట్రలో పంచుతున్నరు : కిషన్ రెడ్డి

తెలంగాణలో దోచుకున్న సొమ్మును మహారాష్ట్రలో పంచుతున్నరు : కిషన్ రెడ్డి
  • తెలంగాణలో దోచుకున్న సొమ్మును మహారాష్ట్రలో పంచుతున్నరు
  • బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం డీఎన్ఏ ఒక్కటే
  • డబుల్​ఇండ్ల పేరుతో కేసీఆర్​మోసం చేసిండు
  • బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి 

మహబూబ్ నగర్ : కేసీఆర్ కుటుంబం తెలంగాణలో దోచుకుంటున్న డబ్బును మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ పేరుమీద పంపిణీ చేస్తోందని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ప్రజా సమస్యలపై బీజేపీ మహార్యాలీ నిర్వహించింది. అనంతరం క్లాక్ టవర్ వద్ద ఏర్పాటుచేసిన సభలో కిషన్​రెడ్డి మాట్లాడారు. ‘ ప్రజల సొమ్ముతో కేసీఆర్10 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్ముక్కై పార్టీ కార్యాలయాలకు జాగలిస్తడు. కానీ పాలమూరులో ఉన్న పేదలకు ఇళ్లు కట్టడు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రేషన్ కార్డులే తప్ప బీఆర్ఎస్​సర్కారుకు పేదలకు రేషన్ కార్డులిచ్చే సోయి లేదు. దళితులకు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠంపై కూర్చున్న ఘనత కేసీఆర్ దీ.  తొమ్మిదేండ్లలో ఒక్క పోస్టుకూడా భర్తీ చేయలేదు. 30 లక్షల మంది యువత ఆకలిమంటల్లో ఉన్నరు. పేపర్ లీక్ తో నిరుద్యోగులు ఆవేదనలో ఉన్నారు’ అని కిషన్​రెడ్డి వాపోయారు.

రైతు రుణమాఫీ ఏదీ?

‘రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానన్న హామీ ఏమైంది? రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు. అప్పులు కట్టలేక డిపాల్టర్ గా మారటం వల్ల రైతులకు అప్పు పుట్టడం లేదు. బంగారు తెలంగాణ దేవుడెరుగు, కానీ కేసీఆర్ కుటుంబం బంగారమైంది. తెలంగాణలో అభివృద్ది కుంటుపడింది. రాష్ట్రాన్ని లిక్కర్ తెలంగాణగా.. అప్పుల తెలంగాణగా మార్చిండు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుటుంబపార్టీలు.  ఈమూడు పార్టీల డీఎన్ఏ ఒక్కటే’ అని కిషన్​రెడ్డి తెలిపారు.

నియంత పాలన అంతమయ్యేదాకా నిద్రపోం 

జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ ‘తెలంగాణలో నియంత పాలన అంతమయ్యే దాకా బీజేపీ నిద్రపోదు. సీఎం కేసీఆర్ సోయి తప్పి ఫామ్ హౌస్ లో పండుకున్నడు. డబుల్​బెడ్రూమ్, రుణమాఫీ, ఉపాధి ఇలా ఎన్నో హామీలిచ్చి మర్శిండు. మన పేరున అప్పులు తెచ్చి వాళ్ల కుటుంబ సభ్యులు జేబులు నింపుకున్నరు. ఇక్కడి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి పేరున కమిషన్లు తీసుకుంటున్నారు. ఇక్కడ నడిఊర్లో ఉన్న కలెక్టరేట్ ను కూల్చి.. ఆయన ఇంటికి దగ్గర్లో కట్టించుకున్నరు. హెరిటేజ్ బిల్డింగ్ ను కూల్చి ఏం చేస్తున్నాడో చెప్పాలి. జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని అరుణ డిమాండ్​చేశారు.