నాగర్కర్నూల్, వెలుగు: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులోని వెంకటాద్రి రిజర్వాయర్(వట్టెం) కట్ట నాణ్యతపై సోమవారం సీఐడీ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు. వట్టె రిజర్వాయర్ లో 16.74 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు 14.5 కిలోమీటర్ల పొడవైన కట్ట నిర్మించారు. ఈ కట్ట నాణ్యతపై ఆరోపణలు రావడంతో విచారణ జరపాలని కారుకొండ గ్రామానికి చెందిన రైతులు 2023లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కట్ట నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో భూ సేకరణ చేయకుండా నాలుగు చోట్ల వదిలేశారని, తర్వాత ఆ ప్రాంతంలో ప్యాచ్లు వేశారని పిటిషన్లో పేర్కొన్నారు. రిజర్వాయర్లోపలి భాగంలో 500 మీటర్ల దూరం నుంచి మట్టి, రాళ్లు తీయాల్సి ఉన్నా కేవలం 50 మీటర్ల దూరంలో బ్లాస్టింగ్చేసి తీసిన రాళ్లు, మొరం కట్టకు వినియోగించారని కోర్టు దృష్టికి తెచ్చారు.
కట్ట నాణ్యతను పరిశీలించి అవసరమైన చోట పటిష్టంగా నిర్మించాలని, గ్రామానికి ఆర్అండ్ఆర్ప్రకటించి కట్ట దిగువ భాగం నుంచి తరలించాలని కోరారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సీఐడీ ఆఫీసర్లు సోమవారం గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. గ్రామస్తుల అనుమానాలు, అభ్యంతరాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని సీఐడీ ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్తెలిపారు.
