జమ్మూలోని శ్రీవారి ఆలయ వేడుకలకు కిషన్ రెడ్డి

జమ్మూలోని శ్రీవారి ఆలయ వేడుకలకు కిషన్ రెడ్డి

జమ్మూ, వెలుగు : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో జమ్మూలోని మాజిన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి మందిర ప్రారంభోత్సవ వేడుకలు ముగిశాయి. గురువారం జరిగిన విగ్రహ ప్రతిష్ఠాపన, మహా సంప్రోక్షణ ప్రొగ్రాముల్లో  కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ధ్వజాహరోహణం, సర్వదర్శన ప్రారంభ వేడుకలకు కూడా ఆయన హాజరయ్యారు. 62 ఎకరాల్లో  నిర్మించిన ఈ ఆలయాన్ని ఈ నెల 3న పుణ్యాహవచనంతో ప్రారంభించారు. ఆరు రోజుల పాటు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో  జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, స్థానిక ఎంపీ జుగల్ కిశోర్ శర్మ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎస్వీ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ప్రెసిడెంట్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో పాటు వేద పండితులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.