రికార్డుల రారాజు..కింగ్ కోహ్లీ మరో రికార్డు క్రియేట్ చేశాడు. ఆదివారం భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో 63 పరుగులు చేసిన కోహ్లీ..టీ20లు, వన్డేల్లో కలిపి 16 వేల పరుగులు చేసిన రెండో క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. మొత్తం 369 మ్యాచుల్లో..352 ఇన్నింగ్స్ లో 55.95 సగటుతో కోహ్లీ 16,004 పరుగులు సాధించాడు. ఇందులో 44 సెంచరీలు, 97 హాఫ్ సెంచరీలున్నాయి.
సచిన్ తర్వాత కోహ్లీనే..
వైట్బాల్ ఫార్మాట్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 16 వేల పరుగులు సాధించాడు. ఆ తర్వాత కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 262 వన్డేల్లో 57.68 సగటుతో 12,344 పరుగులు సాధించాడు. ఇందులో 44 సెంచరీలు, 64 అర్థసెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 183. ఇక 107 టీ20ల్లో 50.83 సగటుతో 3,660 రన్స్ కొట్టాడు. ఇందులో ఒక సెంచరీ, 33 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 122.
ద్రావిడ్ను దాటేశాడు..
టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్గానూ కోహ్లీ చరిత్రకెక్కాడు. రాహుల్ ద్రావిడ్ పేరిట ఉన్న ఈ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. కోహ్లీ 471 అంతర్జాతీయ మ్యాచుల్లో 53.62 సగటుతో 24078 పరుగులు సాధించాడు. భారత్ తరపున రాహుల్ ద్రావిడ్ 24,064 రన్స్ కొట్టాడు. టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ 664 మ్యాచుల్లో 48.52 సగటుతో 34,357 పరుగులు చేశాడు. సచిన్ ఖాతాలో 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ ఖాతాలో 71 సెంచరీలు, 125 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సచిన్, కోహ్లీ, ద్రావిడ్ తర్వాత స్థానాల్లో 18,433 పరుగులతో గంగూలీ, 17,092 పరుగులతో ధోనీ, 16,892 రన్స్ తో సెహ్వాగ్ ఉన్నారు.