మూడు వన్డేల సిరీస్ను భారత్ సొంతం చేసుకున్నా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ విషయంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆదివారం పూణే వేదికగా జరిగిన చివరి వన్డేలో టీమిండియా గెలిచినా.. ఆ రెండు అవార్డులు ఇంగ్లండ్ టీమ్కే సొంతమయ్యాయి. ఫైనల్ వన్డేలో ఒంటరి పోరాటం చేసి.. చివరి వరకు ఇంగ్లండ్ గెలుపు కోసం కృషి చేసిన కరన్(95నాటౌట్)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. మూడు వన్డేల్లో 94, 124,1 పరుగులతో సిరీస్ టాప్ స్కోరర్గా నిలిచిన.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు జానీ బెయిర్ స్టో ఎంపికయ్యాడు.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ... అవార్డుల ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. చివరి మ్యాచ్లో అటు బౌలింగ్లోనూ, ఇటు బ్యాటింగ్లోనూ ఉత్తమ ప్రతిభ కనపరిచిన శార్దుల్ ఠాకూర్ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు. 67 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీయడంతో పాటు.. 20 బాల్స్ లోనే 30 రన్స్ చేసి, భారత విజయంలో కీలక పాత్ర పోషించాడన్నాడు. భువి కూడా సిరీస్ మొత్తంగా చక్కని ఆటతీరును కనబరచాడన్నారు. మూడు మ్యాచ్లలో తక్కువ ఎకనమీతో ఆరు వికెట్లు తీసిన భువి మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు అర్హుడని తెలిపాడు కోహ్లీ.