పరీక్షలకు ప్రిపేర్ అవ్వలేదన్న స్టూడెంట్ కు టీచర్ సలహా. విద్యార్ధిని మృతి

పరీక్షలకు ప్రిపేర్ అవ్వలేదన్న స్టూడెంట్ కు టీచర్ సలహా. విద్యార్ధిని మృతి

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడి తెలివితక్కువ పని వల్ల ఓ విద్యార్ధిని నిండు ప్రాణం బలైంది. మరికొన్ని రోజుల్లో పదవ తరగతి పరీక్షలు రాయాల్సిన ఆ విద్యార్ధిని పురుగుల మందు తాగి ప్రాణం తీసుకుంది. ఈ సంఘటన ఈ సంఘటన మహారాష్ట్రలోని కురుంద్వాడలో జరిగింది. షిరోల్ తాలుకా షిర్తి గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సానిక మాలి  పదవ తరగతి చదువుతోంది. అయితే మరికొన్ని రోజుల్లో పరీక్షలుండగా.. సరిగా ప్రిపేర్‌ అవ్వని సానిక పరీక్షలను తప్పించుకోవటానికి ఏం చేయాలంటూ ఉపాధ్యాయుడైన నీలేష్ బాలూ ప్రధానే ను సలహా అడిగింది.

అందుకతడు కొద్దిగా పురుగులమందు తాగమని, అలా చేస్తే స్ప్రహ కోల్పోయి పరీక్ష హాలు నుంచి నేరుగా ఆసుపత్రిలో చేరవచ్చని చెప్పాడు. స్వయంగా అతడే పురుగుల మందు తెచ్చిచ్చాడు. అతని మాటలు నమ్మిన విద్యార్ధిని నీలేష్ తెచ్చిఇచ్చిన మందులో నీళ్లు కలుపుకుని తాగింది. విష ప్రభావం గల ఆ మందును తాగడం వల్ల అపస్మారక స్థితిలో పడింది. దీంతో ఆమె తల్లిదండ్రులు బాలికను ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ ఈనెల 25న మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్కూల్లోని విద్యార్థులను, టీచర్లను, ఇతర స్టాఫ్‌ను విచారించి నిలేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇశాల్‌కరంజీ డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్ కిషోర్ కాలే ఈ ఘటనపై మాట్లాడుతూ.. జెఎంఎఫ్‌సి కోర్టు ఆదేశాల ప్రకారం నీలేష్ ను మార్చి 6 వరకు రిమాండ్‌కు తరలించామని చెప్పారు.