
టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి కోల్ కతా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. షమీ మాజీ భార్య హాసీన్ జహాన్ కు నెలకు రూ.1.30లక్షల భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆ మొత్తంలో రూ. 50 వేలు తన మాజీ భార్య ఖర్చులకు కాగా, మిగతా రూ.80 వేలు షమీ కూతురు పోషణకు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
తనపై గృహ హింసకు పాల్పడుతున్నాడని హసీన్ 2018లో షమీపై కోల్ కతాలోని జాదవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు వరకట్నం వేధింపులు, గృహ హింస చట్టాల్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. అదే సమయంలో తమ ఖర్చుల కోసం నెలకు రూ.10 లక్షలు భరణం ఇచ్చేలా ఆదేశించాలంటూ హసీన్ కోర్టును ఆశ్రయించింది. ఇందులో రూ. 7లక్షలు తన ఖర్చుల కోసం కాగా మిగిలిన రూ.3 లక్షలు కూతురు మెయింటెనెన్స్ కోసమని పిటిషన్ లో పేర్కొంది. తాజాగా ఈ కేసు విచారణకు రాగా ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నెలకు రూ.1.30లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. అయితే కోర్టు తీర్పుపై హసీన్ అసంతృప్తిగా ఉందని, దానిపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్లు తెలుస్తుంది. షమీ, హసీన్ జహాన్ కు 2014లో వివాహం కాగా, 2018లో విడిపోయారు.