బీజేపీ సభకు భయపడే 20న టీఆర్ఎస్ సభ

బీజేపీ సభకు భయపడే 20న టీఆర్ఎస్ సభ

చౌటుప్పల్ : మంత్రి జగదీశ్ రెడ్డిపై మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాను అమ్ముడుపోయానని జగదీశ్ రెడ్డి రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించకపోతే మంత్రి పదవికు రాజీనామా చేస్తావా అని జగదీశ్ రెడ్డిని ప్రశ్నించారు. నేరచరిత్ర కలిగిన  జగదీష్ రెడ్డి జిల్లాకు మంత్రి అయ్యాడని, నాగారం, తుంగతుర్తిలో మర్డర్ కేసులో ఆయన A1, A2 నిందితుడిగా ఉన్నాడంటూ రాజగోపాల్ రెడ్డి అరోపించారు. తెలంగాణ విభజనకు ముందు జగదీష్ రెడ్డికున్న ఆస్తులెన్ని? ఇప్పుడున్న ఆస్తుల లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే  మొత్తం జగదీశ్ రెడ్డి బండారాన్ని బయట పెడతానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

బీజేపీ సభకు భయపడే సీఎం కేసీఆర్ 20న బహిరంగ సభ పెట్టుకున్నాడని కోమటి రెడ్డి ఆరోపించారు. ఈ నెల 21న మునుగోడులో జరగనున్న బీజేపీ బహిరంగ సభకు లక్షమంది హాజరవుతారని చెప్పారు. గత మూడేళ్లుగా మునుగోడు నియోజకవర్గ సమస్యల్ని పట్టించుకోని కేసీఆర్.. ఉప ఎన్నిక భయంతో అభివృద్ధిపై మాట్లాడుతున్నారని అన్నారు. తన పదవీ త్యాగంతో మునుగోడు అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. మునుగోడు ఉపఎన్నికలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా  ప్రజల తీర్పు ఉంటుందని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.