రుణమాఫీపై సీఆర్​ మొసలి కన్నీరు కారుస్తున్నరు

రుణమాఫీపై సీఆర్​ మొసలి కన్నీరు కారుస్తున్నరు

నల్గొండ/మునుగోడు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లు చేపట్టడం లేదన్న ఆందోళనతో చాలా మంది రైతులు తక్కువ ధరకు మిల్లర్లకు వడ్లను అమ్ముకున్నారని, ఆ రైతులందరికీ మద్దతు ధర చెల్లించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి డిమాండ్​ చేశారు. శుక్రవారం ఆయన మునుగోడులో మీడియాతో మాట్లాడారు. యాసంగి సీజన్​ ప్రారంభంలో రైతులు వరి సాగుకు ప్రయత్నించగా వడ్లు కొనబోమని అధికారుల చేత ప్రచారం చేయించి, అనేకమంది రైతులను పంట సాగు చేసుకోకుండా అడ్డుపడ్డారని అన్నారు. నాలుగు రోజులు కిందటి వరకు కూడా టీఆర్​ఎస్​ నేతలు అనేక డ్రామాలు ఆడి ధర్నాలు, రాస్తారోకోలు చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్​ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి రైతు దగ్గర వడ్లను కొనాలని, లేకపోతే  పెద్దఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. రైతుల రుణమాఫీ చేయకుండా వాళ్లపై ప్రేమ ఉన్నట్లు కేసీఆర్​ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. స్టార్​ క్యాంపెయినర్​గా 18 నెలల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తానని, కాంగ్రెస్​ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ ​ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తానన్నారు. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వెంట డీసీసీబీ డైరెక్టర్​ కుంభం శ్రీనివాస్​రెడ్డి, పాల్వాయి గోవర్ధన్​ రెడ్డి తదితరులు ఉన్నారు.