భారత్ జోడో యాత్రలో ఆకట్టుకున్న కొమ్ము కోయ కళారూపం

భారత్ జోడో యాత్రలో ఆకట్టుకున్న కొమ్ము కోయ కళారూపం

రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. మహబూబ్ నగర్ లో సాగుతున్న ఈ యాత్రలో ఖమ్మం జిల్లా ఆదివాసీలు కొమ్ము కోయ డ్యాన్స్ ను ప్రదర్శించారు. దీన్ని రాహుల్ ఆసక్తిగా తిలకించారు. అంతే కాదు స్త్రీ, పురుషులు కలసి లయబద్ధంగా అడుగులు వేస్తూ చేసే కొమ్ము కోయ ప్రదర్శనలో కళాకారులతో కలిసి రాహుల్ సైతం కాలు కదిపారు. ఆయనతో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా రాహుల్ తో కలిసి నృత్యం చేశారు. అనంతరం ఆదివాసీల కళారూపం గురించి రాహుల్ కి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వివరించారు. 

కొమ్ము కోయ నృత్యం విశిష్టత..

ఖమ్మంతోపాటు ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొండాకోనల్లో నివసించే ఆదివాసీలు తమదైన శైలిలో అనేకానేక కళారూపాలను సృష్టించారు. వాటిలో ‘కొమ్ము కోయ నృత్యం’ ప్రత్యేకమైంది, సృజనాత్మకమైంది.  అడవి దున్న కొమ్ములు, నెమలీకల కలబోతతో.. అసలైన అందానికి అద్దం పడుతుంది. తలమీద ఎద్దు/ అడవి దున్న కొమ్ములతో చేసిన కిరీటం, దాని పైన నెమలి పింఛాలు ధరించి, మెడలో పెద్ద డోలు వేసుకొని చేసే ఈ నృత్య రూపకాన్ని ‘కొమ్ము డోలు’ అని కూడా వ్యవహరిస్తారు. పురుషులు కలసి లయబద్ధంగా అడుగులు వేస్తూ చేసే ప్రదర్శన అయినప్పటికీ, పురుషుల నృత్య పద్ధతి, స్త్రీల నృత్య పద్ధతికి కొంత వ్యత్యాసం ఉంటుంది. పురుషులు ప్రత్యేకమైన వస్త్రధారణతో డోళ్లను లయబద్ధంగా వాయిస్తూ, అడుగులో అడుగులు వేసుకుంటూ నృత్యం చేస్తారు. ఈ ప్రదర్శనను ‘పెర్మికోర్‌’ అని పిలుస్తారు. మహిళలు ఆకుపచ్చ చీరలు ధరించి, కొప్పులో పూలు పెట్టుకొని ఒకరిచేతులు ఒకరు పట్టుకొని ‘రేల’ పాటలు పాడుతూ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దీనిని ‘రేలా నృత్యం’'' అని వ్యవహరిస్తారు. 10 నుంచి 15 మంది పురుషులు డోళ్లు వాయిస్తూ, లయబద్ధంగా అడుగులు కదిలిస్తూ వలయాకారంగా ‘పెరకోరు’అంటారు.