నేటి నుంచి కొమురెల్లి మహా జాతర

నేటి నుంచి కొమురెల్లి మహా జాతర

సిద్దిపేట, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామి మూడు నెలల మహా జాతర ఆదివారం ప్రారంభం కానున్నది. ఆదివారం పట్నం వారం సందర్భంగా దాదాపు లక్ష మంది భక్తులు కొమురవెల్లి మల్లన్నను దర్శించుకోనున్నారు. పట్నం వారం సందర్భంగా హైదరాబాద్  పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కొమురవెల్లికి భక్తులు వస్తుండడంతో వాహనాల రద్దీ పెరిగింది.

 భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున పెద్ద పట్నం, అగ్ని గుండాల కార్యక్రమాలు జరిగే తోటబావి వద్ద భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మూడు నెలల పాటు సాగే మల్లన్న మహా జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్ గఢ్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి దాదాపు పది లక్షల భక్తులు వస్తారని అంచనా. హైదరాబాద్  పరిసర ప్రాంతాల నుంచి శనివారం రాత్రే యాదవులు భారీ సంఖ్యలో కొమురవెల్లికి చేరుకుని ధూళి దర్శనం చేసుకున్నారు.