
సిద్దిపేట/సికింద్రాబాద్, వెలుగు: కొండపోచమ్మ సాగర్ భూనిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. మూడురోజుల క్రితం గజ్వేల్లోని తన నివాసం వద్ద ఆయన దీక్షకు దిగగా మంగళవారం రాత్రి పోలీసులు బలవంతంగా సికింద్రాబాద్లోని యశోదా హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లోనే నర్సారెడ్డి దీక్షను కొనసాగిస్తున్నారు. అక్కడ దీక్షను విరమింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో పోలీసులకు, నర్సారెడ్డి కుటుంబ సభ్యులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో నర్సారెడ్డి కూతురు అంక్షారెడ్డి చేయి విరిగింది. ఆయన సోదరితోపాటు పలువురు కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి. అదే హాస్పిటల్లోనే అంక్షారెడ్డి చికిత్సపొందుతున్నారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు దీక్షను విరమించబోనని నర్సారెడ్డి ‘వెలుగు’తో ఫోన్లో అన్నారు.
సంతోష్కు భూమి ఎలా కేటాయిస్తారు: రేవంత్
కొండపోచమ్మ సాగర్ భూనిర్వాసితులకు న్యాయం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి మండిపడ్డారు. యశోదా హాస్పిటల్లో బుధవారం నర్సారెడ్డిని ఆయన పరామర్శించారు. పోలీసుల తీరు వల్లే నర్సారెడ్డి కూతురుకు, బంధువులకు గాయాలయ్యాయన్నారు. భూ నిర్వాసితులకు న్యాయంచేయని కేసీఆర్.. సడ్డకుని కొడుకు, ఎంపీ సంతోష్ కు 250 గజాల పట్టా భూమిని ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు.