
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఇటీవల హైదరాబాద్లో ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకను నిర్వహించారు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, ప్రభ, శివకృష్ణ, రోజారమణి, కవిత, తనికెళ్లభరణి, బాబుమోహన్, కైకాల నాగేశ్వరరావు, బుర్రా సాయిమాధవ్ తదితరులను సత్కరించారు. అనంతరం కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘సినిమా అనేది సర్కస్లా తయారవుతోంది. విషాదకర పాటలకు కూడా డాన్సులు చేస్తున్నారు. అలాగే రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు లాంటి సీనియర్స్ ఎవరూ తమ పారితోషికం గురించి బయట మాట్లాడలేదు. కానీ ఇప్పుడు హీరోలు రోజుకి రూ. 2 కోట్లు, 6 కోట్లు తీసుకుంటున్నాం అని పబ్లిక్ గా చెపుతున్నారు. ఇది మంచి పద్థతి కాదు’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డా. గారపాటి లోకేశ్వరి, నందమూరి మోహనకృష్ణ, చైతన్యకృష్ణ, గారపాటి శ్రీనివాస్, నందమూరి యశ్వంత్, రిటైర్డ్ ఐజీ మాగంటి కాంతారావు, అంబికా కృష్ణ, తుమ్మల ప్రసన్నకుమార్, విష్ణుబొప్పన తదితరులు పాల్గొన్నారు.