కొత్తగూడ శ్మశానవాటిక గోడ కూల్చి వేత

 కొత్తగూడ శ్మశానవాటిక గోడ కూల్చి వేత
  • ట్రాఫిక్ ​సమస్య ఏర్పడుతుండడంతో యాక్షన్​
  • చెప్పకుండా కూల్చారంటూ స్థానికుల నిరసన   

మాదాపూర్, వెలుగు : ఐటీ కారిడార్​లోని కొత్తగూడ చౌరస్తా సమీపంలోని శ్మశానవాటిక ప్రహరీని అధికారులు చెప్పకుండా కూల్చారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని నిరసిస్తూ కొత్తగూడ గ్రామస్తులు మంగళవారం ఆందోళనకు దిగారు. మాదాపూర్​ నుంచి కొండాపూర్​ వెళ్లే మెయిన్​రోడ్డులో కొత్తగూడ చౌరస్తాకు సమీపంలో ఉన్న శ్మశానవాటిక ప్రహరీ కారణంగా ప్రతి రోజు ట్రాఫిక్​ సమస్య ఏర్పడుతోంది. రోడ్డు వెడల్పు చేసేందుకు సైబరాబాద్​మున్సిపల్​కార్పొరేషన్​అధికారులు, హైడ్రాతో కలిసి సోమవారం రాత్రి శ్మశానవాటిక ప్రహరీని కూల్చివేశారు.

ఉదయం మిగతాది కూల్చడానికి రావడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని తమకు చెప్పకుండా ఎలా కూలుస్తారని ఫైర్​అయ్యారు. దీంతో అధికారులు కూర్చొని మాట్లాడుకుందామని చెప్పడంతో శాంతించారు. మాదాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ బాలక్రిష్ణకు వినతిపత్రం ఇచ్చారు. ప్రహరీ తొలగించి రోడ్డు వెడల్పు చేయడానికి అంగీకరించారు. దీనికి ప్రతిగా శ్మశానవాటిక చుట్టూ ప్రహరీ నిర్మించాలని, చుట్టూ అక్రమణలను తొలగించాలని షరతు పెట్టారు. స్ట్రీట్​లైట్స్​ఏర్పాటు చేసి నీటి సదుపాయం కల్పించాలన్నారు. ఈ పనులన్నీ 15 రోజుల్లో మొదలుపెడుతామని డీసీ గ్రామస్తులకు హామీ ఇచ్చారు.