
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఫారెస్ట్ ల్యాండ్స్ను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం ఎఫ్డీఓ కోటేశ్వరరావు హెచ్చరించారు. ఎఫ్డీఓ ఆఫీస్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చుంచుపల్లి మండలంలోని జగ్గారం తదితర ప్రాంతాల్లో వందలాది ఎకరాల భూమిని గొత్తికోయలు ఆక్రమించుకున్నారని తెలిపారు. ఫారెస్ట్ ల్యాండ్స్పై సర్వే చేసేందుకు వెళ్తున్న సిబ్బందిపై గొత్తికోయలు దాడులకు పాల్పడుతున్నారన్నారు.
ఆదివారం రాత్రి కూడా బీట్ ఆఫీసర్పై దాడికి యత్నించారని, దాడులకు పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఆక్రమించుకున్న ఫారెస్ట్ భూమిని త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.