- రివ్యూ చేసేందుకు త్వరలో ఇండియాకు తిరిగొస్తా
- వ్యాక్సిన్ సప్లయ్ చేయాలని బెదిరింపులొచ్చాయి
- అందుకే ఫ్యామిలీతో ఇంగ్లండ్ వచ్చేశా: సీరమ్ సీఈఓ అధర్ పూనావాలా
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ సప్లయ్కు సంబంధించి బెదిరింపులు ఎదుర్కొంటున్న సీరమ్ ఇన్స్టిట్యూట్(సీఐఐ) సీఈఓ ఆదర్ పూనావాలా, త్వరలో తిరిగి ఇండియాకు వస్తానని ప్రకటించారు. దేశంలోని పెద్ద వ్యక్తుల నుంచి కోవిషీల్డ్ సప్లయ్ చేయాలని ఒత్తిడి పెరుగుతోందని, బెదిరిస్తున్నారంటూ తన ఫ్యామిలీతో పాటు యూకేకు వెళ్లిపోయినా ఆయన, తిరిగి ఇండియాకు వస్తానని ‘ది టైమ్స్’ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సీరమ్ పుణే ప్లాంట్లో పూర్తి సామర్ధ్యంతో వ్యాక్సిన్ను తయారు చేస్తున్నామని, తిరిగి ఇండియా వచ్చాక ప్లాంట్ పరిస్థితిలను రివ్యూ చేస్తానని పేర్కొన్నారు. కానీ, ఎప్పుడు తిరిగి వస్తారో స్పెసిఫిక్గా చెప్పలేదు. యూకేలోని కంపెనీ పార్టనర్లు, షేరుహోల్డర్లతో సమావేశమయ్యాయని పూనావాలా పేర్కొన్నారు. కాగా, ఇండియాకు వెలుపల కూడా కోవిషీల్డ్ను తయారు చేయాలని సీరమ్ నిర్ణయించుకుంది. దేశంలో కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. తాజగా ఒక్క రోజులోనే 4 లక్షల కేసులు రికార్డయ్యాయి. కరోనా వ్యాక్సిన్, మెడిసిన్స్తో పాటు ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.
కుంభమేళా, ఎలక్షన్స్ గురించి మాట్లాడా..
‘ప్రస్తుత పరిస్తితుల్లో ఇండియాకు వెళ్లకూడదని అనుకున్నా. అందుకే ఇక్కడే(యూకే) ఉంటున్నా. మన పని మనం పూర్తిగా చేస్తున్నా, ఎవరో కొంత మందికి వ్యాక్సిన్ అందకపోవడంతో వాళ్లు ఏం చేస్తారో అనే ఆలోచనతో బతకాలనుకోవడం లేదు.’ అని టైమ్స్ ఇంటర్వ్యూలో పూనావాలా చెప్పారు. భారమంతా తనపై పడిందని, కానీ, తానుక్కడినే వ్యాక్సిన్ డిమాండ్ను చేరుకోలేనని తెలిపారు. ‘కుంభమేళ’, అసెంబ్లీ ఎలక్షన్స్ వలన కరోనా సెకెండ్ వేవ్ పెరిగిందనే అంశంపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. ‘ఇలాంటి సెన్సిటివ్ విషయాలపై మాట్లాడితే నా తల తెగిపోవచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు. పూనావాలా వ్యాఖ్యలపై చాలా మంది నెగిటివ్గా స్పందిస్తున్నారు. మరికొంత మంది కంపెనీ ఇండియాకు వెలుపల వ్యాక్సిన్ తయారు చేస్తుండడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 1 నుంచి దేశంలో 18–45 ఏళ్ల వయుసున్న వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకొంది. వ్యాక్సిన్ల కొరత నెలకొనడంతో కొన్ని రాష్ట్రాలలో కరోనా వ్యాక్సినేషన్ మూడో ఫేజ్ స్టార్ట్ కాలేదు. ఉత్తరప్రదేశ్, చత్తీస్గడ్, మహారాష్ట్ర, జమ్మూ అండ్ కాశ్మీర్లలో ఫేజ్ 3 వ్యాక్సినేషన్ ప్రాసెస్ స్టార్టయ్యింది. కొన్ని రాష్ట్రాలలో నామమాత్రంగా స్టార్ట్ చేశారు.
బిజినెస్ పనులున్నాయి..
పూనావాలాకు ప్రభుత్వం ‘వై’ కేటగిరీ భద్రతను ప్రొవైడ్ చేసిన తర్వాత ఆయన మీడియా ముందుకు రావడం ఇదే మొదటి సారి. కోవిషీల్డ్ను సప్లయ్ చేయాలని కొంత మంది వార్నింగ్ ఇస్తున్నారని టైమ్స్ ఇంటర్వ్యూలో పూనావాలా పేర్కొన్నారు. తన కుటుంబంతో లండన్కు వచ్చేయడానికి ముఖ్య కారణం ఈ ఒత్తిడేనని చెప్పారు. యూకేలో కొన్ని బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయని అన్నారు. ఇండియాకు వెలుపల వ్యాక్సిన్ మాన్యుఫాక్చరింగ్ చేపట్టాలనుకుంటున్నామని, ఇందులో ఇంగ్లండ్ ఉందని అన్నారు. గత వారం కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోస్ ధరను రూ. 400 నుంచి రూ. 300 లకు సీఐఐ తగ్గించింది. కేంద్రానికి డోసు రూ. 150 కే ఇస్తూ, రాష్ట్రాలకు రూ. 400 అమ్మడంపై విమర్శలు రావడంతో కంపెనీ వ్యాక్సిన్ డోసు ధరను తగ్గించింది. ప్రస్తుతం దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ను ఎక్కువగా వేస్తున్నారు. దీంతో పాటు భారత్ బయోటెక్ కోవ్యాగ్జిన్ను కూడా వేస్తున్నారు.