- గాంధీ విగ్రహం వద్ద కాలనీవాసుల నిరసన
కూకట్పల్లి, వెలుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీగా పేరొందిన కేపీహెచ్బీ కాలనీని జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనలో మూడు ముక్కలుగా చేయడంపై కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. కాలనీ మొదటి రోడ్డు గాంధీ బొమ్మ వద్ద శుక్రవారం వారు నిరసన చేపట్టారు. కాలనీని మూడు డివిజన్లుగా (కేపీహెచ్బీ, బాలాజీ నగర్, వసంత నగర్) విభజించడంతో 46 ఏండ్ల చరిత్ర కలిగిన కేపీహెచ్బీ అస్తిత్వం కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రోడ్ నంబర్ 1 నుంచి జేఎన్టీయూ రోడ్డు వరకు కేపీహెచ్బీ డివిజన్-1గా, జేఎన్టీయూ రోడ్డు నుంచి కల్వరి టెంపుల్ వరకు డివిజన్-2గా మార్చాలని కోరారు. కార్యక్రమంలో కట్టా నరసింగరావు, కొల్లా శంకర్, షేక్ సత్తార్, నారాయణరావు, రాచకొండ భాస్కర్, ముప్పాళ్ల సాంబశివరావు పాల్గొన్నారు.
