ఒక్క బొట్టు కూడా వదులుకోం: రేవంత్
కృష్ణాలో 34% తీస్కుంటమని సంతకం చేసి ఇప్పుడు 50% అంటున్నడు
కేసీఆర్ మహా జాదూ.. రాజకీయ, ఆర్థిక లబ్ధి కోసమే నీళ్ల పంచాయితీ
కృష్ణా నీళ్లపై జంతర్ మంతర్ దగ్గర కేసీఆర్, కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలె
పాలమూరు సామర్థ్యాన్ని టీఎంసీ తగ్గించి రూ. 30 వేల కోట్ల వ్యయం పెంచారని ఫైర్
కృష్ణాలో 34% తీస్కుంటమని కేసీఆర్ సంతకం చేసి ఇప్పుడు 50% అంటున్నడు
కేసీఆర్ మహా జాదు.. రాజకీయ, ఆర్థిక లబ్ధి కోసమే నీళ్ల పంచాయతీ
హైదరాబాద్, వెలుగు:కృష్ణా నీళ్లను ఏపీకి ఇవ్వడానికి కేసీఆర్కు ఆయన తాతలిచ్చిన ఆస్తి కాదని పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఒక్క నీటి బొట్టును కూడా వదులుకోమని చెప్పారు. కేసీఆర్ మహా జాదు అని.. నీళ్ల నుంచి ఓట్లు, నోట్లు సృష్టించగలడని అన్నారు. కృష్ణా జలాల్లో ఏపీ 66 శాతం, 34 శాతం తెలంగాణ వాడుకుంటామని సంతకాలు చేసి ఇపుడు కొత్తగా 50 శాతం వాడుకుంటామని కేసీఆర్ మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. లేని వివాదాన్ని కేసీఆర్ సృష్టిస్తున్నారని ఫైరయ్యారు. కేసీఆర్ అనుమతి తీసుకున్నాకే రాయలసీమ ప్రాజెక్టును జగన్ ప్రారంభించారని ఆరోపించారు. ప్రగతి భవన్లో కేసీఆర్, జగన్ల భేటీ తర్వాతే ఏపీ జీవో విడుదల చేసిందన్నారు. జీవో ఇచ్చి, పనులు మొదలుపెట్టినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తాము ఒత్తిడి పెంచడంతో పాలమూరుకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటిషన్లో ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యిందని గుర్తు చేశారు. వివాదం చేసి, సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికే కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసి 90 శాతం పూర్తిచేసిన ప్రాజెక్టులను పెండింగ్లో ఉంచారన్నారు.
కేసీఆర్ను జగన్ కుటుంబ పెద్దగానే చూడాలె
ఈ నెల 9న జరగనున్న కేఆర్ఎంబీ మీటింగ్ను వాయిదా వేయాలని, 20న పెట్టాలని కేసీఆర్ ఎందుకు కోరుతున్నారని రేవంత్ ప్రశ్నించారు. ‘మీరు బిజీగా ఉంటే గతంలో ఇరిగేషన్ మంత్రులుగా పని చేసిన కడియంనో, తుమ్మలనో పంపండి. 9న కేఆర్ఎంబీ మీటింగ్కు హాజరై వాదనలు వినిపించకపోతే జగన్కు లొంగినట్లే’ అన్నారు. కృష్ణాలో తెలంగాణ వాటా కోసం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కేసీఆర్, కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలని, ఆ దీక్షకు తమ పార్టీ హైకమాండ్ను ఒప్పించి మద్దతు తెలుపుతామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి తగ్గించి అంచనా వ్యయాన్ని రూ. 30 వేల కోట్ల నుంచి రూ. 60 వేల కోట్లకు పెంచారన్నారు. పాత ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ రోజు కేంద్రానికి జగన్ లెటర్లు రాసే పరిస్థితి ఉండేది కాదన్నారు. కేసీఆర్ను జగన్ కుటుంబ పెద్దగానే చూడాలని అన్నారు. తన మీద కోపంతో కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేసీఆర్ విస్మరించారన్నారు.
రాష్ట్రానికి అన్యాయం చేసినోళ్లే మంత్రులైన్రు
ఉద్యమంలో పనిచేసిన వాళ్లు ఎవరు మంత్రులు కాలేదని, తెలంగాణకు అన్యాయం చేసిన ద్రోహులే మంత్రులయ్యారని రేవంత్ ఆరోపించారు. గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి.. అంతా ద్రోహులేనన్నారు. కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ను మంత్రిగా, ఎమ్మెల్యేగా గౌరవిస్తే పార్టీ ఫిరాయింపు చేసి టీఆర్ఎస్లో చేరారని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది రాజీనామా చేసి మాట్లాడాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నుంచి గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను రాళ్లతో, చెప్పులతో కొడతామని కార్యకర్తలు అన్నారని, అలాంటి వాళ్లకు కాంగ్రెస్ కార్యకర్తలతో చెప్పుల దండలు వేయిస్తానని రేవంత్ అన్నారు.
నేతలతో వరుస భేటీలు
ఈ నెల 7న పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న రేవంత్.. పార్టీ నేతలతో వరుసగా భేటి అవుతున్నారు. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డితో ఆదివారం భేటీ అయ్యారు. తర్వాత ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తో, మాజీ ఎంపీ ఎంఏ ఖాన్, మాజీ మంత్రి గడ్డం వినోద్లతో భేటీ అయ్యారు. మాజీ సీఎం, మాజీ గవర్నర్ రోశయ్య బర్త్ డే సందర్భంగా అమీర్పేటలోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు చెప్పి ఆశీస్సులు తీసుకున్నారు.