బనకచర్లపై వాస్తవాలు చెప్పండి.. ఏపీకి కృష్ణా బోర్డు లేఖ

బనకచర్లపై వాస్తవాలు చెప్పండి.. ఏపీకి కృష్ణా బోర్డు లేఖ
  • తెలంగాణ అభ్యంతరాలకు స్పందన

హైదరాబాద్​, వెలుగు: ఆంధ్రప్రదేశ్​ చేపడుతున్న పోలవరం – బనకచర్ల లింక్​ ప్రాజెక్ట్​పై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్​ఎంబీ) స్పందించింది. ఆ ప్రాజెక్ట్​పై వారంలోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీని బోర్డు ఆదేశించింది. ఈ మేరకు ఏపీకి లేఖ రాసింది. బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్​ తయారీకి ఇటీవల ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది.
దీనిపై ఈ నెల 10నే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. 

డీపీఆర్​కు టెండర్లు పిలవకుండా ఏపీని ఆపాలంటూ పోలవరం ప్రాజెక్ట్​ అథారిటీ (పీపీఏ)తో పాటు సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ)కి ఈఎన్సీ జనరల్​ అంజద్​ హుస్సేన్​ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాసిన ఆ లేఖను తాజాగా ఏపీకి పంపుతూ.. కృష్ణా బోర్డు చైర్మన్​ లేఖ రాశారు. ‘‘బనకచర్ల ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం డీపీఆర్​ తయారీకి సిద్ధమవుతున్నట్టు తెలంగాణ అభ్యంతరం తెలుపుతూ లేఖ రాసింది. 

డీపీఆర్​ తయారీకి టెండర్లు పిలుస్తున్నట్టు కేంద్రం దృష్టికి తీసుకొచ్చింది. కాబట్టి ఈ ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను వెంటనే తెలియజేయండి. ప్రాజెక్ట్​ స్థితిగతులపై వారంలోగా వివరణ ఇవ్వండి’’ అని పేర్కొంటూ ఏపీ ఈఎన్​సీకి బోర్డు చైర్మన్​ లేఖ రాశారు.