
కేంద్ర ఐఏఎస్ బృందమే చెప్పింది
అంతకంటే ఇంకేం కావాలి
మిడ్మానేరు నిర్వాసితులకు ఎక్కువే ఇచ్చాం
అమాయకులను రెచ్చగొడుతున్న కాంగ్రెస్నేతలు: కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు చూసి సీఎం కేసీఆర్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని కేంద్రం నుంచి వచ్చిన ఐఏఎస్ల బృందం పేర్కొందని… అంతకంటే ఏం కావాలని సిరిసిల్ల ఎమ్మేల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్లలోని మిడ్మానేరు నిర్వాసితులకు అనుకున్నదానికంటే ఎక్కువగానే పరిహారం ఇచ్చామని, కాంగ్రెస్నేతలు అమాయకులను రెచ్చగొట్టి పాదయాత్రల పేరిట రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పరిహారం తీసుకున్నవారిని కూడా తీసుకువచ్చి రోడ్ల మీద కూర్చుండబెట్టారని దుయ్యబట్టారు. రాజకీయ ఉనికి కోసమే కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారని విమర్శించారు. మిడ్మానేరు ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోవడమే కాకుండా, నిర్వాసితులకు సకాలంలో పరిహారం ఇవ్వని ఘనత కాంగ్రెస్దని ఎద్దేవా చేశారు. అటువంటి మిడ్మానేరును టీఆర్ఎస్ సర్కార్ పూర్తి చేసి, సిరిసిల్లను సస్యశ్యామలం చేస్తోందని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నిర్వాసితులకు పరిహారం అందించడమే కాకుండా సీఎం కేసీఆర్ చొరవతో రూ. 350 కోట్లు అదనంగా చెల్లించామని ఆయన చెప్పారు. వేములవాడ అభివృద్ధి మీద బాధపడుతున్న కాంగ్రెస్ నాయకులు వారి ప్రభుత్వ హయాంలో రాజన్న ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని, పైగాదేవుడి సొమ్ము తిన్న ఘనత వారిదేనని విమర్శించారు.
అతి విశ్వాసంతోనే వినోద్ను ఓడగొట్టుకున్నాం
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అతి విశ్వాసం పనికిరాదని టీఆర్ఎస్ కేడర్కు కేటీఆర్ సూచించారు. అతి విశ్వాసానికి పోయి.. కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో వినోద్కుమార్ అనే మంచి నాయకుడి ఓటమికి కారణమయ్యామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రూపు రాజకీయాలు వీడాలని సూచించారు. నెల రోజుల్లో మిడ్మానేరులోకి నీరు రాబోతుందని, సిరిసిల్ల బ్రిడ్జి కిందిదాకా బ్యాక్ వాటర్ వచ్చి ఇక్కడి ప్రాంతం పచ్చబడే రోజు అతిత్వరలో రాబోతుందని ఆయన అన్నారు.