
- మంత్రులపై కేటీఆర్ కినుక
- రేవంత్ ఆరోపణలను ఖండించలేదని ఫైర్
- సన్నిహితుల వద్ద తీవ్ర అసంతృప్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రులపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కినుక వహించినట్టు తెలిసింది. గ్లోబరీనా వ్యవహారంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఇతర నేతలు చేసిన విమర్శలను ఒక్కరూ ఖండించలేదు. మే డే వేడుకల్లో కేటీఆర్ మరోసారి తనకు గ్లోబరీనాతో సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు . రూ.10 వేల కోట్ల స్కాం చేసినట్టు రేవంత్ ఆరోపించడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.4.30 కోట్ల టెండర్కు రూ.10 వేల కోట్ల లంచమిస్తారా అని ప్రశ్నించారు.అదే వేదికపై నుంచి కాం గ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పైవిరుచుకుపడ్డారు . తనపై కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను తానే ఖండించుకోవాలా అని కొందరు సన్నిహితుల వద్ద కేటీఆర్ ప్రస్తావించినట్టుగా తెలిసింది.
ఆరోపణలను ఓ ఎమ్మెల్యే, ఓ కార్పొరేషన్ చైర్మన్ మినహా ఎవరూ ఖండించక పోవడాన్ని తప్పుబట్టినట్టు తెలిసింది. గ్లోబరీనా విషయంలో వచ్చిన ఆరోపణలను తనకు మాత్రమే పరిమితమైనవి అన్నట్టు మంత్రులు, నేతలు వ్యవహరిం చడాన్ని కేటీఆర్ తప్పుబడుతున్నట్టు సమాచారం. కొం దరు ముఖ్యనేతలు ఆఫ్ ది రికార్డుగా పెద్దాయన వీహెచ్ ను ఉద్దేశించి బఫూన్ అనకుంటే బాగుండు అన్నట్టు చేసిన వ్యాఖ్యలూ కేటీఆర్ దృష్టికి వచ్చినట్టుగా తెలిసింది.ఆరోపణలను ఖండించకపోగా తననే తప్పుబట్టేలా బయటి వ్యక్తుల వద్ద ప్రస్తావించడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
మంత్రులు, ఇతరనేతల తీరుతోనే కేటీఆర్ రెండు, మూడు రోజులుగా బయటికి రావడం లేదని, ఎవరితోనూ మాట్లాడటం లేదని తెలిసింది. హోంమంత్రి మహమూద్ అలీ మినహా మిగతా మంత్రులంతా నిత్యం మీడియాతో టచ్లోనే ఉంటున్నారు . 9 మంది మంత్రులు స్థానిక ఎన్నికల ప్రచారం కోసం ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఈ సందర్భంగా ఏ ఒక్కరూ కూడా రేవంత్ వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగిన సందర్భాలు లేవు.