తీరుమారని బీఆర్ఏస్

తీరుమారని బీఆర్ఏస్

ఆధిపత్యాన్ని చలాయించి,  అహంకారాన్ని ప్రదర్శించి,  అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఏ ప్రభుత్వానికైనా ఓటమి, అవమానం,  ఛీత్కారాలు తప్పవు.  పరిపాలనకు ఉన్న ఈ కనీస ధర్మాలను, రాజ్యాంగ నేపథ్యంలో సామాజిక బాధ్యతలను ఏ ప్రభుత్వాలు అయితే విస్మరిస్తాయో అవి శాశ్వతంగా ప్రజల చేతిలో ఓటమిపాలు కాక తప్పదు. అయితే సవరించుకొని,  తప్పులను అంగీకరించి,  ప్రజల ముందు మోకరిల్లి,  ప్రజలను ప్రభువులుగా చూసే సంస్కారాన్ని  ప్రదర్శించే రాజకీయ పార్టీలకు  కొంత అవకాశం ఉండే  పరిస్థితులు ఉంటాయి. కానీ  అదే అహాన్ని  ఓటమి తర్వాత కూడా చట్టసభల్లో ప్రదర్శించి,  తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోకుండా, ప్రభుత్వం మీద నియంతృత్వ ధోరణితో  విమర్శలకు పాల్పడి, సభను విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఆ రాజకీయ పార్టీకి ప్రజలు ప్రభుత్వం చేతిలో  పరాభవమే మిగులుతుంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ పోషిస్తున్న పాత్ర  అక్షరాల ఈ సన్నివేశానికి వర్తిస్తుంది. ఇతర  విపక్షాలు,  ప్రజాస్వామ్యవాదులు,  ప్రభుత్వం  ముప్పేట విమర్శలకు దిగినా, చేసిన  నేరాన్ని అంగీకరించని, ప్రజల ముందు తలవంచని  పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఏస్ లో చూడవచ్చు.

నైతికత కోల్పోయిన బీఆర్​ఎస్​

గవర్నర్  ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో అట్టర్ ప్లాప్ అవుతుందని  శాపనార్థాలు పెట్టడం సరికాదు. ఇది ప్రజాతీర్పును అవమానించడమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2014 నుండి బీఆర్ఏస్ ప్రభుత్వమే పదేళ్లుగా పరిపాలించినప్పుడు  ఇక కాంగ్రెస్ పార్టీని విమర్శించే అధికారం ఎక్కడిది ? పదే పదే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన గూర్చి మాట్లాడి విమర్శలకు గురైన కేటీఆర్, హరీష్ రావులపై  ఒక దశలో సీపీఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అసహనం వ్యక్తం చేయడంతో పాటు, బేరసారాలు మొదలు పెడతారా ? ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారా?  కేటీఆర్ అలా మాట్లాడడం మంచిది కాదు అని హెచ్చరించిన తీరు బీఆర్ఏస్ శాసనసభ్యుల  అసందర్భ వాదనకు చెక్ పెట్టినట్లుగా భావించాలి. 

అహంకారం తగ్గలే

పదే పదే  కాంగ్రెస్‌‌కు 64 మంది సభ్యులు ఉంటే తమకు 39 మంది సభ్యులు ఉన్నారని  ఎలా పరిపాలన చేస్తారో చూస్తామని కేటీఆర్  బెదిరించడం అహంకారానికి నిదర్శనం. ప్రజలు, ప్రజాస్వామికవాదులు తీవ్ర అభ్యంతరం తెలపాల్సిన విషయం ఇది. ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదు అని బీఆర్ఏస్ శాసనసభ్యులు హెచ్చరిస్తున్నారంటే  ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా?  కొంతమంది శాసనసభ్యులు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని అది మంచిది కాదు.

 ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక  భాగం. ప్రతిపక్షంగా కొత్త ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది. స్వేచ్ఛ లేని జీవితాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించబోరు. బీఆర్ఏస్ ప్రభుత్వంలో మాట్లాడే స్వేచ్ఛ లేని కారణంగానే ప్రజలు తిరుగుబాటు చేసి ఓడించారు. అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ చేసిన ప్రసంగం ఇతర బీఆర్ఏస్ ఎమ్మెల్యేలలో సోయి తెప్పిస్తే సంతోషం. 

అంతటా బకాయిలే

తెలంగాణ ధనిక రాష్ట్రమని, అన్నింటిలో నంబర్ వన్ అని, బంగారు తెలంగాణ అని పదే పదే ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏనాడైనా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లించినారా? ఇప్పటికీ విద్యార్థులకు సుమారు రూ.7000 కోట్ల స్కాలర్ షిప్,  ఫీజు రియింబర్స్​మెంట్ నిధులు పెండింగ్‌‌లో ఉన్నాయంటే గత పాలన ఎంత దుర్మార్గమయిందో అర్థం అవుతుంది. 

అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రసంగిస్తుంటే పదేపదే అడ్డు తగిలిన బీఆర్ఎస్ సభ్యులను ‘సభలో ఇంత మంది కలిసి ఇబ్బంది పెడతారా. నన్ను బెదిరించలేరు’ అని ఆయన వారించవలసి వచ్చిందంటే  ప్రభుత్వంతో పాటు ఇతర విపక్షాలను కూడా బీఆర్ఎస్ సభ్యులు ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారో, ఎంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారో తెలుస్తుంది. ఇదంతా టీవీ ప్రసారాల ద్వారా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అవసరమైన సందర్భంలో తప్పకుండా ప్రతిస్పందిస్తారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైనారంటే ప్రజల పరిశీలన మేరకే కదా!

  అసెంబ్లీలో బీఆర్​ఎస్​ ప్రవర్తన 

ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సందర్భంలో  బీఆర్ఎస్ పార్టీకి చెందిన అనేకమంది శాసనసభ్యులు అడ్డు తగలడం, కొత్తగా శాసనసభ్యునిగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి సభలో  వ్యవహరించిన తీరుపైన స్పీకర్ కలగజేసుకొని ‘కొత్త సభ్యుడివి. శాసనసభలో గడ్ బడ్ చేయకు’ అని చేసిన హెచ్చరిక  ఆ పార్టీ మొత్తానికి గుణపాఠమైతే బాగుండు.   టీవీలు, పత్రికలు ప్రసార మాధ్యమాలతో పాటు  అన్నింటా వారి ప్రవర్తనను ప్రజలు గమనించడం  చర్చనీయాంశం కాగా,  సుపరిపాలనకు ఏ రకంగాను బీఆర్ఏస్ పార్టీ సహకరించే పరిస్థితులు లేవని అందరూ అసహ్యించుకుంటున్న పరిస్థితి. 

‘ఇదే పరిస్థితి కొనసాగితే సభలో కూడా కొనసాగలేరు. ప్రజలు తరిమి కొడతారు’ అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించవలసి వచ్చింది అంటే బీఆర్ఎస్ పార్టీ దిగజారుడుతనం  అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజా తీర్పును శిరసావహించి, ప్రజల పక్షాన  పనిచేయడం ద్వారా  విశ్వాసాన్ని చూరగొనాలి. కానీ  అడుగడుగునా సభలో అహంకారాన్ని ప్రదర్శిస్తే ప్రజల నుండి ఎదురయ్యేది చేదు అనుభవాలే జాగ్రత్త!

అవినీతిపై దర్యాప్తులు అవసరం

తొమ్మిదిన్నర ఏళ్ల సుదీర్ఘ పాలనలో వెనుకా ముందు చూడకుండా చేసిన అప్పులు,  యువతకు చేసిన ద్రోహం,  సంక్షేమ పథకాలలోని డొల్లతనం, రాజకీయ ఉద్యోగ వర్గాలలో నెలకొన్న అవినీతి  అంతా ఇంతా కాదు.ఈ దుస్థితికి బాధ్యురాలైన బీఆర్ఎస్ పార్టీ  మాజీ ముఖ్యమంత్రి, మంత్రివర్గంపైన  విచారణ జరిపించాలి.  దోషులను శిక్షించవలసిన అవసరం ఉందని అనేక వర్గాల నుండి ప్రభుత్వంపై ఒత్తిడి వస్తున్నది. . ఇది  ప్రజల కోసం పనిచేసే సుపరిపాలన కోరుకునే  కోట్లాది ప్రజల ఆకాంక్ష.  

మాసంపల్లి అరుణ్ కుమార్,రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు, తెలంగాణ జన సమితి పార్టీ