తెలంగాణ సంస్కృతికే పరిమితమైన బతుకమ్మ పండుగను ఈ రోజున దేశ విదేశాల్లో ఆడపడచులంతా జరపుకుంటున్నారంటే దానికి కారణం తెలంగాణ జాగృతి సంస్థ అని అన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో, తెలంగాణ జాగృతి సంస్థ చేస్తున్న కృషిని అభినందిస్తూ కేటీఆర్ ఓ ప్రత్యేక వీడియో మెసేజ్ ను విడుదల చేశారు. వీడియోలో.. పువ్వుల్ని పూజించే విశిష్ట సంప్రదాయాన్ని, స్వరాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఆయుధంగా , విడదీయలేని ఉద్యమ రూపంగా మార్చిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థదే అన్నారు.
దేశ, విదేశాల్లోని తెలంగాణ ఆడబిడ్డలు ఇవాళ సగర్వంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి మాజీ ఎంపీ కవిత నాయకత్వంలో ఆనాడు జాగృతి చేసిన పోరాటమే కారణమన్నారు. నాటి సమైక్య పాలకులు ట్యాంక్ బండ్ పై బతుకమ్మను నిషేధించి తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తే, హైకోర్టుకు వెళ్లి మరీ బతుకమ్మను సంబురంగా ఆడిన ఘన చరిత్ర జాగృతికి ఉందన్నారు.
సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్న బతుకమ్మ చీరలకు ప్రేరణ జాగృతే అన్నారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన సోదరి కవిత, దశాబ్ద కాలంగా జాగృతిలో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికి మంత్రి కేటీఆర్ ఈ వీడియో ద్వారా అభినందనలు తెలిపారు.