హైదరాబాద్ లో రైల్వే, బస్ స్టేషన్లలో పెరిగిన రద్దీ... ప్రయాణికుల తాకిడితో మరిన్ని స్పెషల్ రైళ్లు

హైదరాబాద్ లో రైల్వే, బస్ స్టేషన్లలో పెరిగిన రద్దీ... ప్రయాణికుల తాకిడితో మరిన్ని స్పెషల్ రైళ్లు
  • ప్యాసింజర్లు పెరగడంతో పక్క జిల్లాకు ఆర్టీసీ సిటీ బస్సులు
  • దోచుకుంటున్న ప్రైవేట్​ బస్సులు
  • కార్లలో వెళ్తుండడంతో  హైవేపై ట్రాఫిక్​ జామ్స్​ 

హైదరాబాద్​సిటీ, వెలుగు : సంక్రాంతికి మూడు రోజుల ముందు నుంచే నగర జనం ఊరి బాట పట్టగా..ఈ రద్దీ సోమవారం మరింత పెరిగింది. దీంతో నగరంలోని రైల్వే , బస్​ స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి, హైటెక్​సిటీ రైల్వేస్టేషన్లతో పాటు జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, కేపీహెచ్​బీ, ఎల్​బీనగర్, ఆరామ్​ఘర్​ తదితర బస్​స్టేషన్లలో ఇసుక వేస్తే రాలనంత ప్రయాణికులు కనిపిస్తున్నారు. దీంతో రైల్వే, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు దొరకడం లేదు. దీంతో చాలామంది ప్రైవేట్​బస్సులు, కార్లవైపు మళ్లుతున్నారు. 

ఈ క్రమంలో రైల్వే జనరల్​ప్యాసింజర్లను దృష్టిలో పెట్టుకుని అన్​రిజర్వుడ్​రైళ్లను అందుబాటులోకి తీసుకురాగా, ఆర్టీసీ స్పెషల్​బస్సులను మరిన్ని రంగంలోకి దింపింది. సాధారణంగా సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారే ఎక్కువగా ఉంటారని, ఈసారి తెలంగాణ జిల్లాలకు కూడా ఫ్లో పెరిగిందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 50శాతానికి పైగా జనం సొంతూళ్లకు వెళ్లారని అంటున్నారు. 

స్పెషల్​ రైళ్లు, బస్సులు..

సంక్రాంతి కోసం మొదట్లో 50 స్పెషల్​రైళ్లను నడిపిన రైల్వే ఇప్పుడు రద్దీ పెరగడంతో  మరో 112 స్పెషల్​రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే, రిజర్వేషన్​చేయించుకోకుండా జనరల్​రైళ్లలో వెళ్లే వారి 194 అన్​రిజర్వ్​స్పెషల్​ట్రైన్లను నడుపుతోంది. ఇతర స్పెషల్ ట్రైన్లు మరో 400 కలిపి 804 రైళ్లను నడిపిస్తోంది. స్పెషల్​ రైళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే వారికే ఎక్కువగా కేటాయించామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. 

అలాగే,  ఇదే సీజన్​లో శబరి మలై వెళ్లే వారి కోసం 48 రైళ్లను నడిపిస్తోంది. ఆంధ్రా వైపు వెళ్లేందుకు ఎంజీబీఎస్​నుంచి 1,100 స్పెషల్​ బస్సులు, తెలంగాణ జిల్లాలకు వెళ్లే వారి కోసం జేబీఎస్​నుంచి వెయ్యి స్పెషల్​బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. మెదక్​, గజ్వేల్​, కరీంనగర్​లాంటి పక్క జిల్లాలకు వెళ్లే వారి కోసం కొన్ని సిటీ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
 

ప్రైవేట్​ ట్రావెల్స్​ దోపిడీ  

ఇన్ని రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడుపుతున్నా అందులో సీట్లు, టికెట్లు దొరకని వారు ప్రైవేట్​బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారి అవసరాలను ప్రైవేట్​ట్రావెల్స్​నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ రోజుల్లో కంటే టికెట్​ఛార్జీలను రెండు నుంచి మూడు రెట్లు అధికంగా పెంచి దండుకుంటున్నారు. దీన్ని నివారించడానికి చాలా చోట్ల ఆర్టీఏ తనిఖీలు చేస్తున్నా తీరు మారడం లేదు. 

కార్లలో ప్రయాణం, హైవేలో ట్రాఫిక్ ​జామ్​

రైళ్లు, బస్సులు, ప్రైవేట్​ట్రావెల్స్​లో వెళ్లి ఇబ్బందులు పడడం ఎందుకని చాలామంది సొంత, రెంట్​కార్లు మాట్లాడుకుని ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై పెద్దయెత్తున ట్రాఫిక్​ జామ్​ఏర్పడుతోంది. అలాగే, బెంగళూరు, ముంబై హైవే, రాజీవ్​నేషనల్​హైవేలపై వాహనాల రద్దీ పెరిగింది. 

219 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు

ప్రయాణికులను దోచుకుంటున్న ప్రైవేట్​ట్రావెల్స్​పై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. అధిక ఛార్జీలు వసూలు చేయకుండా, ఫిట్​నెస్ లేని బస్సులను నడపకుండా ​, ప్యాసింజర్​బస్సుల్లో గూడ్స్​రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీని కోసం  హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 8 తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి సోమవారం వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 219 పైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు.