డీసీసీబీ చైర్మన్​గా కుంట రమేశ్ రెడ్డి

డీసీసీబీ చైర్మన్​గా కుంట రమేశ్ రెడ్డి
  • సింగిల్​ నామినేషన్​తో ఎన్నిక ఏకగ్రీవం
  • కాంగ్రెస్​ ఖాతాలోకి జిల్లా కీలక పదవి
  • ఖాళీగా వైస్​ చైర్మన్​ పోస్టు 

నిజామాబాద్​, వెలుగు : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్​గా కుంట రమేశ్ రెడ్ది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఆయన ఒక్కరే నామినేషన్​ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.  ఈ నెల 21న మెజారిటీ డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానంతో పోచారం భాస్కర్​రెడ్డిని ఛైర్మన్​ పదవి నుంచి దింపేయడంతో ఖాళీ అయిన పోస్టు భర్తీ చేయడానికి మంగళవారం  ఎన్నిక నిర్వహించారు. ఓటు హక్కు ఉన్న మొత్తం 20 మంది డైరెక్టర్లలో 17 మంది హాజరై కుంట రమేశ్​రెడ్డితో నామినేషన్​ వేయించారు.

ఆయనకు పోటీగా ఎవరూ నామినేషన్​ వేయనందున ఎన్నిక యునానిమస్​ అయినట్లు డీసీవో శ్రీనివాస్​రావు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్​ను చైర్మన్​గా ఎన్నికైన రమేశ్​రెడ్డికి ఆయన అందించారు. సభ్యుల ఆవిశ్వాసంతో పదవి కోల్పోయిన పోచారం భాస్కర్​రెడ్డి ఈ ఎన్నికలో పాల్గొనలేదు. కీలకమైన చైర్మన్​  పదవి కాంగ్రెస్​ లిస్టులో చేరడంతో పార్టీ లీడర్లు సంతోషంగా ఉన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్​ తాహెర్​, అంతిరెడ్డి రాజిరెడ్డి తదితర కాంగ్రెస్​ నేతలు  చైర్మన్​ రమేశ్ ​రెడ్డిని పూలమాలలతో అభినందించారు. 

వైస్​ చైర్మన్ పోస్టు ఖాళీ

ఈనెల 21న నిర్వహించిన బలపరీక్షలో ఓడిపోయి పోచారం భాస్కర్​రెడ్డి పదవి కోల్పోయాక వైస్​ చైర్మన్​ కుంట రమేశ్​రెడ్డికి ఇన్​చార్జ్​ చైర్మన్​ బాధ్యతలు అదే రోజు అప్పగించారు. ఇప్పుడు  బ్యాంకు పూర్తి స్థాయి చైర్మన్​గా ఆయనే ఎన్నికవడంతో  వైస్​ చైర్మన్​ కుర్చీ వెకెంట్​ అయింది. ​ ఖాళీ అయిన వైస్​ చైర్మన్‌ పోస్టు ఎన్నికను డైరెక్టర్లు తీర్మానం ద్వారా కోరితే గవర్నమెంట్​ తేది ప్రకటించి నిర్వహిస్తుంది.  ఈ పదవిని ముగ్గురు డైరెక్టర్లు ఆశిస్తుండగా ఏకాభిప్రాయ సాధనకు కాంగ్రెస్​ నేతలు ప్రయత్నిస్తున్నారు. 

రైతులకు అండగా ఉంటా

జిల్లా రైతాంగానికి సేవ చేసే పదవి లభించినందుకు సంతోషంగా ఉందని చైర్మన్​గా ఎన్నికైన రమేశ్​రెడ్డి మీడియాతో అన్నారు.  పాలకవర్గంలోని డైరెక్టర్లందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు. సింగిల్​ విండో పాలకవర్గానికి అందుబాటులో ఉంటానన్నారు.  తనకు పదవి లభించేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన 
కృతజ్ఞతలు తెలిపారు.