- కేంద్రంపై మండిపడ్డ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కుసుమ్ ఆలం
ఆదిలాబాద్, వెలుగు: ఆదివాసీ గిరిజనులు చదువుకుని తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే వారిని అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేసి అణచివేస్తున్నారని ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కుసుమ్ ఆలం అన్నారు. లీడర్ షిప్ డెవలప్మెంట్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్జిల్లాలో పర్యటిస్తున్న ఆమె బుధవారం సాత్నాల మండలంలోని పలై తండాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజన సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ పేదలకు ఉపయోగంగా ఉండే మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచిందని, కొత్త చట్టాన్ని తెచ్చి వారి ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. గతంలో పేదలకు ఇండ్ల స్థలాలు పంచిన గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ దేనన్నారు. డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ సెద్మకి ఆనంద్ రావు, కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు.
