
ధూల్పేట్: హైదరాబాద్లో లేడీ డాన్ సంధ్యా బాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్యా బాయిని ఎక్సైజ్, టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 2 కిలోల గంజాయి సీజ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తెచ్చి ఈ లేడీ డాన్ హైదరాబాద్లో అమ్ముతుంది. ధూల్పేట్ కేంద్రంగా సంధ్య బాయి గంజాయి విక్రయిస్తుంది. ఐటీ ఏరియాలో ఉద్యోగులకు సంధ్య గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ధూల్పేట్ లేడీ డాన్గా పేరొందిన సంధ్య బాయిని ధూల్పేట్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
హైదరాబాద్లో గంజాయికి కేరాఫ్గా ధూల్పేట్ మారడంతో ఎక్సైజ్, టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ ఏరియాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. జూలై 24, 2024న ‘ఆపరేషన్ ధూల్పేట్’ పేరుతో ధూల్పేట్ను జల్లెడ పట్టిన సంగతి తెలిసిందే. ధూల్పేట్లోని అనుమానిత ప్రాంతాల్లో అప్పట్లో తనిఖీలు నిర్వహించారు. గంజాయి అమ్మకాలు చేపట్టిన పాత నేరస్తులతో పాటు కొత్తగా గంజాయి అమ్మకాల్లో దిగిన వారి ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు.
ALSO READ | జానీని వారం రోజులు అప్పగించండి.. కోర్టులో పోలీసుల కస్టడీ పిటిషన్
ధూల్పేట్లో జుమ్మెర బజార్, దేవీ నగర్, చక్కెర వాడి, జుంగూర్ బస్తి, సేవాదళ్ ఇమ్లీబాగ్, బలరాం గల్లి మాగ్ర , గంగాబౌలి, మతిం ఖా నా, చున్నీకి బట్టి ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. 8 ప్రత్యేక బృందాలతో 50 మందికి పైగా పోలీసులు ఉన్నతాధికారులు కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసులు ఇంతగా శ్రమిస్తుంటే.. సంధ్యా బాయి లాంటి వాళ్లు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని అమ్ముతున్నారు.