మహిళా నిర్మాత వేధింపుల కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు

మహిళా నిర్మాత వేధింపుల కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు

బంజారాహిల్స్​ కేబీఆర్​ పార్క్​లో ఓ మహిళా సినీ నిర్మాతని గుర్తు తెలియని వ్యక్తి జులై 9న వేధించిన విషయం విదితమే. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. హైదరాబాద్​ మల్లేపల్లి కి చెందిన మహమ్మద్​ ఇక్బాల్(25) ఆమెను వేధించినట్లు విచారణలో  తేలింది. బ్లాక్​ కలర్​ వెర్నా కార్​లో వచ్చిన అతన్ని జులై 13న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

కేసు పూర్వాపరాలివి..

జులై 9న మహిళా నిర్మాత కేబీఆర్​ పార్క్​లో జాగింగ్​ చేస్తున్నారు. అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అశ్లీల హావభావాలు ప్రదర్శించాడు. ఫోన్​కెమెరాతో ఫొటోలు తీయడానికి ప్రయత్నించాడు. గంట వ్యవధిలో మూడు సార్లు ఇలా జరిగింది.  వీఐపీలతో పాటు మార్నింగ్ వాకింగ్​కి  ప్రసిద్ధి చెందిన కేబీఆర్ పార్క్‌లో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 

2022 ఏప్రిల్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న 45 ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.  నవంబర్ 2021లో, టాలీవుడ్ నటి షాలు చౌరసియా ఈవినింగ్ వాక్ చేస్తున్నప్పుడు దాడి చేసి దోచుకున్నారు. దాడిని ప్రతిఘటించే క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. 

అదే నెలలో గుర్తు తెలియని వ్యక్తి తనను వేధించి రూ.2 వేల 500 లాక్కెళ్లాడని మరో మహిళ ఫిర్యాదు చేసింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి ఉండటం మహిళా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.