
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరి కేసులో ఇప్పటివరకు ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు అడిగింది. రైతులపై కారు దూసుకెళ్లిన ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. వీరిలో నలుగురు రైతులు ఉన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై దాఖలైన పిల్ విచారణ సందర్భంగా కోర్టు పైవ్యాఖ్యలు చేసింది. ఎంతమందిని అరెస్ట్ చేశారనే వివరాలతో కూడిన రిపోర్టును 24 గంటల్లోపు తమకు సమర్పించాలని యూపీ సర్కారును అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో నిందితులు ఎవరు, ఎవరెవర్ని అరెస్టు చేశారనే వివరాలను చెప్పాలని కోర్టు సూచించింది. దర్యాప్తు సరిగ్గా జరగట్లేదని మండిపడిన కోర్టు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించింది. కాగా, లఖీంపూర్ ఘటనపై విచారణకు ఆదేశించిన యోగి ఆదిత్యనాథ్ సర్కారు.. రిటైర్డ్ హైకోర్టు జడ్జి ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది.