డెలి‘వర్రీ'..లక్సెట్టిపేట సీహెచ్సీలో డాక్టర్ల కొరత..గైనకాలజిస్టులు లేక ఇబ్బందులు

డెలి‘వర్రీ'..లక్సెట్టిపేట సీహెచ్సీలో డాక్టర్ల కొరత..గైనకాలజిస్టులు లేక ఇబ్బందులు
  • తొమ్మిది మందికి ఉన్నది ముగ్గురే
  • మూడు మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీ
  • గైనకాలజిస్టులు లేక డెలివరీలకు బ్రేక్
  • జనరల్​ ఫిజిషియన్​ కొరతతో రోగులకు తప్పని ఇబ్బందులు 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట కమ్యూనిటీ హెల్త్​సెంటర్(సీహెచ్​సీ)లో డాక్టర్ల కొరత వెంటా డుతోంది. ఇక్కడ మొత్తం తొమ్మిది మంది డాక్టర్లకు గాను ముగ్గురే ఉన్నారు. ఇద్దరు రెగ్యులర్​డాక్టర్లు పీజీ చేయడానికి వెళ్లగా, మరో ఇద్దరు కాంట్రాక్ట్​వైద్యులు ఇటీవలే రిజైన్ చేశారు. అలాగే మూడు మెడికల్ ఆఫీసర్​పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. దీంతో అందుబాటులో ఉన్న డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతోంది. వివిధ సమస్యలతో హాస్పిటల్​కు వచ్చే పేషెంట్లకు అరకొర సేవలతో సరిపెడుతున్నారు. గైనకాలజిస్టులు లేకపోవడంతో డెలివరీలకు మంచిర్యాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. 

ఇద్దరు కాంట్రాక్టు డాక్టర్లు రిజైన్

లక్సెట్టిపేటలోని 30 పడకల​హాస్పిటల్​లో అనస్థీషియన్, గైనకాలజిస్టు, పిడియాట్రీషియన్, జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జన్, పల్మనాలజిస్ట్​తో పాటు ముగ్గురు ఎంబీబీఎస్​డాక్టర్లు ఉండాలి. మొన్నటివరకు ఇద్దరు గైనకాలజిస్టుల్లో ఒకరు రెగ్యులర్, మరొకరు కాంట్రాక్ట్ డాక్టర్ ఉండేవారు.

 రెగ్యులర్​ డాక్టర్ ​నాగ​ అఖిల మెటర్నిటీ లీవ్​లో వెళ్లగా, కాంట్రాక్ట్​ డాక్టర్​ స్రవంతిరావు రిజైన్ చేశారు. ఇద్దరు పిడియాట్రిషియన్లలో సాయికిరణ్​పీజీ చేయడానికి వెళ్లగా, ప్రస్తుతం శ్రీజ ఒక్కరే ఉన్నారు. 
కాంట్రాక్ట్​బేసిక్​పై పనిచేస్తున్న జనరల్​ ఫిజిషియన్​వంశీకృష్ణ సైతం ఇటీవల రిజైన్​ చేసి వెళ్లిపోయారు. పల్మనాలజిస్టుతో పాటు మూడు మెడికల్​ఆఫీసర్(ఎంబీబీఎస్) పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. జనరల్​సర్జన్ హిమబిందు ఉన్నారు. అనస్థీషియన్​​ శ్రీనివాస్​సూపరింటెండెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

సవాల్​గా మారిన ట్రీట్​మెంట్

లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల నుంచి లక్సెట్టిపేట సీహెచ్​సీకి నిత్యం వందల మంది పేషెంట్లు వైద్యం కోసం వస్తుంటారు. ఇదివరకు రోజూ 300 మంది ఔట్​పేషెంట్లు, నెలకు దాదాపు వెయ్యి మంది ఇన్​పేషెంట్లకు సేవలందించినప్పటికీ.. ప్రస్తుతం డాక్టర్ల కొరత కారణంగా మెరుగైన ట్రీట్​మెంట్ అందించడం ఇబ్బందిగా మారింది. 

మొన్నటివరకు ఇద్దరు గైనకాలజిస్టులు ఉండడంతో నెలకు 15 నుంచి 20 డెలివరీలు చేశారు. వారిద్దరు మానేయడంతో డెలివరీ కేసులను మంచిర్యాల ఎంసీహెచ్​కు రెఫర్ ​చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. లేదంటే లోకల్​గా ఉన్న ప్రైవేట్​ హాస్పిటల్స్​కు వెళ్లాల్సిందే. గతంలో నెలకు సుమారు 20 పోస్టుమార్టంలు నిర్వహించగా, ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే డాక్టర్లను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.